Share News

Hyderabad: నకిలీ మందుల ఫార్మా గుట్టు రట్టు.. రూ.7.34 లక్షల విలువైన టాబ్లెట్లు స్వాధీనం

ABN , Publish Date - Mar 02 , 2024 | 11:46 AM

నకిలీ మందుల ఫార్మ గుట్టు రట్టయింది. మలక్‌పేట(Malakpet)లోని ఓ ఫార్మా సంస్థపై ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు దాడులు చేసి భారీ ఎత్తున నకిలీ మందులు, మూలికలు, మందుల తయారీకి ఉపయోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: నకిలీ మందుల ఫార్మా గుట్టు రట్టు.. రూ.7.34 లక్షల విలువైన టాబ్లెట్లు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: నకిలీ మందుల ఫార్మ గుట్టు రట్టయింది. మలక్‌పేట(Malakpet)లోని ఓ ఫార్మా సంస్థపై ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు దాడులు చేసి భారీ ఎత్తున నకిలీ మందులు, మూలికలు, మందుల తయారీకి ఉపయోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.7.34 లక్షలు విలువ గల మొత్తం 27,200 టాబ్లెట్స్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఔషధ నియంత్రణ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.

అరవపల్లి సత్యనారాయణ అనే వ్యక్తి మూసారంబాగ్‌ క్రాస్‌రోడ్స్‌ సమీపంలో వంగరి నవీన్‌కు నకిలీ మందుల నిల్వలను విక్రయిస్తూ ఇటీవల అధికారులకు పట్టుబడ్డాడు. విచారించగా మీర్‌పేటకు చెందిన గాండ్ల రాములు నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. అరవపల్లి సత్యనారాయణ, వంగరి నవీన్‌, గాండ్ల రాములును అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌కు చెందిన విశాద్‌కుమార్‌ నుంచి నకిలీ డ్రగ్స్‌ లభిస్తున్నట్లు వివరించారు. అతనికి సచిన్‌ కుమార్‌ అనే వ్యక్తి సహకరిస్తున్నట్లు తెలిపారు. తాము వాట్సాప్‌ కాల్స్‌ ద్వారా సచిన్‌ కుమార్‌, విశాద్‌ కుమార్‌లకు డ్రగ్స్‌ ఆర్డర్లు ఇచ్చినట్లు రాములు అంగీకరించాడు. వాటిని కొరియర్‌ ద్వారా తీసుకుని మలక్‌పేటలోని ఫార్మా కంపెనీలో ఉంచి విక్రయిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఫార్మా కంపెనీపై అధికారులు దాడులు చేశారు.

స్వాధీనం చేసుకున్న మందులు సుద్ద పొడితో డమ్మీ టాబ్లెట్‌లను తయారు చేసి ప్రముఖ కంపెనీకి చెందిన లేబుల్స్‌తో వాటిని ప్యాక్‌చేసి, యాంటీబయాటిక్‌ డ్రగ్‌ ‘సెఫిక్సైమ్‌ ట్యాబ్లెట్స్‌’ అని తప్పుగా పేర్కొని విక్రయిస్తున్నారు. గ్లాక్సో స్మిత్‌క్లైన్‌ (జీఎ్‌సకే), ఆల్కెమ్‌, వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన లేబుల్స్‌ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 02 , 2024 | 11:46 AM