Hyderabad: యువతిలా చాటింగ్ చేసి.. రారమ్మని చంపేశారు..!
ABN , Publish Date - Mar 08 , 2024 | 11:10 AM
ఓ యువకుడి హత్యకు పథకం వేసిన నిందితులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అందమైన యువతి ఫొటోపెట్టి అతడితో చాటింగ్ చేయడం మొదలుపెట్టారు. కొన్నిరోజు తర్వాత రహస్యంగా కలుద్దాం అని మెసేజ్ చేశారు.
- పాతకక్షల నేపథ్యంలో ఘాతుకం
హైదరాబాద్: ఓ యువకుడి హత్యకు పథకం వేసిన నిందితులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అందమైన యువతి ఫొటోపెట్టి అతడితో చాటింగ్ చేయడం మొదలుపెట్టారు. కొన్నిరోజు తర్వాత రహస్యంగా కలుద్దాం అని మెసేజ్ చేశారు. నిజంగానే అమ్మాయే పిలిచిందని నమ్మి వెళ్లిన యువకుడిని దారుణంగా చంపేశారు. ఈ నెల 5వ తేదీన చింతల్మెట్ ఎం.ఎం పహడీలో జరిగిన గుర్తుతెలియని వ్యక్తి హత్యకేసును పోలీసులు ఛేదించగా ఈ విషయం వెలుగుచూసింది. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సీహెచ్ శ్రీనివాస్(DCP CH Srinivas) వివరాలు వెల్లడించారు. బాలాపూర్ షాహీన్నగర్ బిస్మిల్లాకాలనీకి చెందిన యూసుఫ్ కుమారుడు మహ్మద్ ఫహీమ్ (20) పెయింటర్గా పనిచేస్తున్నాడు. అదేకాలనీలో ఉంటున్న మహ్మద్ యూసుఫ్ కుమారుడు మహ్మద్ యాసిన్ (22) చికెన్షాప్ నిర్వహించేవాడు. వారిద్దరికీ గత నెల 25వ తేదీన ఓ విషయంలో గొడవ జరిగింది. దీనిపై మహ్మద్ ఫహీమ్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చారు. అది మనుస్సులో పెట్టుకున్న మహ్మద్ యాసిన్ ఎలాగైనా మహ్మద్ ఫహీమ్ను అంతమొందించాలని కుట్రపన్నాడు. కాలాపత్తర్కు చెందిన టీనేజర్, షాహీన్నగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్ మినాజ్ (20), ఫలక్నుమా ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖయ్యూమ్(19), మహ్మద్ ఫయీమ్(23)తో కలిసి ఫహీమ్ను హత్య చేయాలని పథకం వేశాడు.

దీనిలోభాగంగా నేహాఖాన్ అనే యువతి పేరుతో ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేశారు. అందులో అందమైన యువతి ఫొటోను డీపీగా పెట్టారు. మహ్మద్ ఫహీమ్తో చాటింగ్ చేయడం మొదలుపెట్టారు. అలా చాటింగ్ చేస్తూ ఈ నెల 5వ తేదీన చింతల్మెట్ ఎం.ఎం పహడీ వద్దకు రమ్మని మెసేజ్ చేశారు. నిజంగానే అందమైన అమ్మాయి పిలిచిందని భావించిన ఫహీమ్ అక్కడకు వెళ్లాడు. అప్పటికే అక్కడ స్నేహితులతో కాపు కాచిన మహ్మద్ యాసిన్ కత్తులతో ఫహీమ్ను పొడిచి, ఆ తర్వాత బండరాయితో మోది హత్య చేశారు. ఫహీమ్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులైన మహ్మద్ యాసిన్, ఓ టీనేజర్, మహ్మద్ అబ్దుల్ మినాజ్, మహ్మద్ ఖయ్యూమ్, మహ్మద్ ఫయీమ్లను పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్కు తరలించారు. వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, కత్తి, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.