Chennai: పబ్లో కూలిన పైకప్పు.. హిజ్రా సహా ముగ్గురు మృతి
ABN , Publish Date - Mar 30 , 2024 | 11:29 AM
పబ్లో మద్యం ఇచ్చే ప్రాంతంలోని పైకప్పు కూలిన ఘటనలో ఓ హిజ్రా సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు. స్థానిక ఆళ్వార్పేట సేమియర్స్ రోడ్డులో ఉన్న ఓ పబ్లో ఒక వైపు మద్యం సరఫరా చేసే బార్, మరో పక్క ఆహారం అందజేస్తుంటారు.
![Chennai: పబ్లో కూలిన పైకప్పు.. హిజ్రా సహా ముగ్గురు మృతి](https://media.andhrajyothy.com/media/2024/20240326/nani5_2_009db90ba4.jpg)
చెన్నై: పబ్లో మద్యం ఇచ్చే ప్రాంతంలోని పైకప్పు కూలిన ఘటనలో ఓ హిజ్రా సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు. స్థానిక ఆళ్వార్పేట సేమియర్స్ రోడ్డులో ఉన్న ఓ పబ్లో ఒక వైపు మద్యం సరఫరా చేసే బార్, మరో పక్క ఆహారం అందజేస్తుంటారు. ఈ పబ్ సమీపంలో మెట్రోరైలు రెండవ విడత సొరంగం తవ్వే పనులు జరుగుతున్నాయి. ఈ పబ్లో గురువారం రాత్రి యువతీ, యువకులు మొత్తం 30 మంది వరకు ఉన్నారు. ఆ సమయంలో హఠాత్తుగా మద్యం సరఫరా చేసే ప్రాంతంలోని పైకప్పు కూలిపడింది. ఈ ఘటనలో మద్యం బార్ ఉద్యోగి దిండుగల్కు చెందిన సైక్లోన్ రాజ్ (48) మణిపూర్కు చెందిన హిజ్రా లల్లి (24), మేక్స్ (25)లు పైకప్పు శిధిలాల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న మైలాపూర్, తేనాంపేట తదితర ప్రాంతాల నుంచి 3 వాహనాలతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని శిధిలాలు తొలగించే పనులు చేపట్టారు. శిధిలాల తొలగింపు అనంతరం మృతిచెందిన ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వాసుత్రికి తరలించారు. ఈ ఘటనపై అభిరామపురం పోలీసులు కేసు నమోదుచేసి పబ్ యజమాని, మేనేజర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలాన్ని కార్పొరేషన్ కమిషన్ డా. జె.రాధాకృష్ణన్ పరిశీలించి, ఆ భవనానికి సీలు వేయాలని ఆదేశించారు. కాగా, మెట్రోరైలు పనులకు పబ్ పైకప్పు కూలిన ఘటనకు సంబంధం లేదని చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) ప్రకటించింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొనేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటుచేసినట్లు నగర పోలీసు శాఖ తూర్పు మండల డిప్యూటీ కమిషనర్ జి.దర్మరాజన్ తెలిపారు.