ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలి : ఎస్పీ
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:55 AM
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా వివాదాలకు దూరంగా ఉండి, ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ.జి.కృష్ణకాంత్ అన్నారు.
మద్దికెర, ఏప్రిల్ 17: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా వివాదాలకు దూరంగా ఉండి, ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ.జి.కృష్ణకాంత్ అన్నారు. బుధవారం మండలంలోని ఎం.అగ్రహారం గ్రామంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎం.అగ్రహారం గ్రామంలో ఆరు పోలింగ్ కేంద్రాలున్నాయనీ, నాలుగు వేల మంది ఓటు హక్కును వినియోగించుకుంటారనీ తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయో లేదో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదని తెలపారు. పోలింగ్ రోజున 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలకు పాల్పడితే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలుంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని, లేనిపోని గొడవల్లో తలదూర్చి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. నగదు, మద్యం పంపిణీకి దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ రమేష్బాబు, వీఆర్వో స్వర్ణలత, పోలీసులు కోదండ, శేఖన్న, తదితరులు ఉన్నారు.