వంతు సమయంలోనూ.. అందని సాగునీరు
ABN , Publish Date - Apr 06 , 2024 | 12:47 AM
వంతులవారీ విధానంలో సాగునీరు సరఫరా జరుగుతున్న నేపథ్యంలో తమ కాల్వ కు వంతు ఎప్పుడు వస్తుందా.. చేలకు నీరు పెట్టకుందా మని ఎదురుచూసిన రైతులకు నిరాశే ఎదురయ్యింది.
![వంతు సమయంలోనూ.. అందని సాగునీరు](https://media.andhrajyothy.com/media/2024/20240326/5_YLM_1a_349856d8df.jpg)
పాలుపోసుకునే దశలో ఎండిపోతున్న వరిచేలు
కాజ బ్రాంచ్ పంట కాల్వ కింద 450 ఎకరాలకు నీరందని వైనం
నెర్రలు తీస్తున్న వరిచేలు.. అన్నదాతల కన్నీళ్లు
యలమంచిలి, ఏప్రిల్ 5: వంతులవారీ విధానంలో సాగునీరు సరఫరా జరుగుతున్న నేపథ్యంలో తమ కాల్వ కు వంతు ఎప్పుడు వస్తుందా.. చేలకు నీరు పెట్టకుందా మని ఎదురుచూసిన రైతులకు నిరాశే ఎదురయ్యింది. కాజ బ్రాంచ్ పంట కాల్వకు గురువారం సాయంత్రం నుంచి సాగునీటి వంతు మొదలైనా ఊటాడ, కాజ గ్రామాల పరిధిలోని వరిచేలకు సాగునీరు అంద డం లేదు. పాలు పోసుకునే దశలో ఉన్న వరిచేలు సాగునీరు అందక నెర్రలు తీస్తున్నాయి. ఊటాడ, కాజ గ్రామాల పరిధిలోని సుమారు 450 ఎకరాలకు కాజ బ్రాంచ్ పంట కాల్వ ద్వారా చుక్కనీరు అందకపోవడంతో అన్న దాతలు అవస్థలు పడుతున్నారు. కాల్వ ద్వారా నీరు వస్తుందేమో.. చేలకు నీరు పెట్టు కుందామని రైతులు రేయింబవళ్లు పంట కాల్వ చుట్టూ తిరుగుతున్నారు. గురువారం సాయంత్రం నుంచి ఈ కాల్వకు సాగునీటి వంతు నడుస్తున్నా.. నీరు రాకపోవడంతో ఏం చేయాలో తెలియడం లేదని రైతులు వాపోతు న్నారు. పాలు పోసుకునే దశలోని చేలకు నీరందకపోతే తీవ్ర నష్టాల బారిన పడతామని ఆందోళన చెందుతున్నారు. పట్టించు కునే నాథుడే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆయకట్టులోని చేలకు ఒక్కతడి పెడితే సరిపోయే దశలో నీరు అందకపోవడంతో చేలు ఎండి పోతున్నాయి. ఎకరాకు సుమారు రూ.40 వేలు పెట్టుబడి పెట్టామని.. ఇదే పరిస్థితి సాగితే తాము తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇరిగేషన్ శాఖ సిబ్బంది వస్తున్నారు.. వెళుతున్నారు.. సమస్య పరిష్కారం కావ డంలేదని రైతులు చెబుతున్నారు. గడచిన సార్వా పంట మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని.. అయినప్పటికీ తాము అప్పులు చేసి దాళ్వా పంటకు పెట్టుబడులు పెట్టా మని, ఈ పరిస్థితుల్లో సాగునీరు అందకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆందోళన చెందుతున్నారు. సుమారు నెల రోజుల క్రితం సార్వా పంట నష్ట పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పి సీఎం జగన్ బటన్ నొక్కారని.. ఇంతవరకూ ఏ రైతుకూ పరిహారం సొమ్ము అందిన దాఖలాలు లేవని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎండిపోతున్న తమ చేలకు సాగు నీరందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.