భీమవరంలో టెన్షన్.. టెన్షన్
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:50 AM
ఎన్నికలు సమీపిస్తున్న వేళ భీమవరం పట్టణంలో రోడ్లపై పంచాయితీలు పెరి గాయి. ఎన్నికల కోడ్ రాక ముందే కొంత మంది బాహా బాహీకు దిగుతున్నారు.
పంచాయితీ చేసి పంపిస్తున్న పోలీసులు
భీమవరం క్రెం, మార్చి 5 : ఎన్నికలు సమీపిస్తున్న వేళ భీమవరం పట్టణంలో రోడ్లపై పంచాయితీలు పెరి గాయి. ఎన్నికల కోడ్ రాక ముందే కొంత మంది బాహా బాహీకు దిగుతున్నారు. దీంతో రోడ్లుపై ప్రయాణించేవారు భయపడే పరిస్థితి నెలకొంది. కొన్ని రాజకీయ పార్టీల వారు కావాలనే కొందరిపై దాడులకు దిగటం సర్వసాధారణంగా మారింది. సాయంత్రం నుంచి అర్ధ రాత్రి వరకూ పూటుగా మద్యం సేవించినవారు రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతూ అవతలివారిని రెచ్చగొట్టడంతో తగాదాలు వస్తున్నాయి. చివరకు పోలీసుల వచ్చి పంచాయతీలు చేసి తిరిగి పంపేస్తున్నారు. రెండు రోజుల క్రితం భీమవరం పోలీస్ బొమ్మ సెంటర్లో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఘర్షణకు దిగారు. చివరకు రాడ్లతో కొట్టుకునే పరిస్ధితి నెలకొనడంతో స్ధానికులు వారిని ఆపి సర్ధిచేసి పంపారు. అలాగే నెలరోజుల క్రితం బైపాస్ రోడ్డులోని ఒక మద్యం దుకాణం వద్ద కొందరు యువత బీరు సీసాలతో దాడి చేసుకుని తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. సుమారు 20 రోజుల క్రితం స్థానిక మెంటేవారితోటలో కొందరు యువత ఘర్షణకు దిగారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో పారిపోయారు.
పోలీసులంటే భయం లేదు..
గతంలో పోలీసులు రాత్రి 8 గంటల నుంచి సీఐ స్థాయి అధికారి నుంచి కింది స్థాయి అధికారి వరకు గస్తీ తిరిగేవారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం పోలీసులు ఎక్కువగా గస్తీ తిరగకపోవడంతో యువత రెచ్చిపోతున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాల్లో మద్యం సేవించి ఆ ప్రాంతాల్లో ఉన్నవారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.భీమవరం జిల్లా కేంద్రంగా మారినప్పటి నుంచి పరిస్ధితులు తారుమారయ్యాయి. పోలీసులు ఆకతాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టి సరైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.