టీచర్ల డిప్యుటేషన్లు రద్దు
ABN , Publish Date - Apr 13 , 2024 | 11:54 PM
ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో పని సర్దుబాటు (వర్క్ అడ్జస్ట్మెంట్)కింద డిప్యూటేషన్లపై ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ఈ నెల 23న పాతస్థానాల్లో విధుల్లో చేరాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.
![టీచర్ల డిప్యుటేషన్లు రద్దు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
23న పాతస్థానాల్లో రిపోర్టు చేయాలని ఆదేశాలు
ఏలూరు ఎడ్యుకేషన్, ఏప్రిల్ 13 : ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో పని సర్దుబాటు (వర్క్ అడ్జస్ట్మెంట్)కింద డిప్యూటేషన్లపై ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ఈ నెల 23న పాతస్థానాల్లో విధుల్లో చేరాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. రేషనలైజేషన్ నిబంధనల మేరకు ఉమ్మడి జిల్లాలో మిగులు (సర్ప్లస్)గా గుర్తించిన టీచర్లను కొరతవున్న పాఠ శాలలకు గతేడాది అక్టోబర్లో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద తాత్కాలికంగా డిప్యూ టేషన్లపై నియమించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం ఉమ్మడి జిల్లాలో సుమారు 200 మందికిపైగా ఉపాధ్యాయులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పనిదినం ఈనెల 23న వర్క్ అడ్జస్ట్మెంట్/ డిప్యూటేషన్ టీచర్లందరినీ రిలీవ్ చేసి వారు జీతం డ్రా చేసే పాఠశాలల్లో రిపోర్టు చేయాలని ఆదేశించడంతో ఆ మేరకు చర్యలు తీసుకోనున్నారు. డైట్ కేంద్రాలు, సమగ్రశిక్షలో డిప్యూటేషన్లపై పనిచేస్తున్న వర్క్ అడ్జస్ట్మెంట్ టీచర్లకు, హెచ్ఎంలకు మాత్రం మినహాయింపు ఇచ్చినందున తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కొన సాగు తారు. ఈ ఉత్తర్వులకు అనుబంధంగా విద్యాశాఖ ఆదేశాలు జారీచేయాల్సి ఉంది.