టీడీఆర్ బాండ్లకు చెక్
ABN , Publish Date - Aug 08 , 2024 | 12:00 AM
వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా ఇచ్చిన టీడీఆర్ బాండ్లతో ఇప్పుడు నష్టం జరుగుతోంది. జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీల్లో ఇష్టానుసారంగా వైసీపీ హయాంలో జారీచేశారు.
బాండ్ల మంజూరు నిలిపివేత
మార్గదర్శకాలు వస్తేనే జారీ
వైసీపీ అక్రమ దందాతో నిలుపుదల చేసిన కూటమి ప్రభుత్వం
జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకులో కుంభకోణం
కాలయాపన కమిటీలతో సరి
రంగంలోకి దిగనున్ను సీబీసీఐడీ
(భీమవరం–ఆంఽధ్రజ్యోతి)
వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా ఇచ్చిన టీడీఆర్ బాండ్లతో ఇప్పుడు నష్టం జరుగుతోంది. జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీల్లో ఇష్టానుసారంగా వైసీపీ హయాంలో జారీచేశారు. కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగింది. రెండు పట్టణాల్లోనూ ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులు టీడీఆర్ బాండ్లతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వాటిపై ఇప్పుడు సీబీసీఐడీ విచారణ జరగనుంది. తొలుత శాఖాపరమైన విచారణ చేపడతారు. ఆ తర్వాత సీబీసీఐడీ రంగంలోకి దిగనుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బాండ్లు ఎవరికి జారీ చేయాలి? ఎవరు అర్హులు? రెండు మునిసిపాలిటీల్లోనూ ఎవరికి జారీ చేశారు? వాటిని ఎవరికి విక్రయించారు? ఎవరి ఖాతాలో అమ్మకం సొమ్ములు జమ అయ్యాయి? ఇలా అన్ని కోణాల్లోనూ సీబీసీఐడీ దర్యాప్తు చేయనుంది. బాఽధ్యులపై చర్యలకు ఉపక్రమించనుంది. సీబీసీఐడీ అనగానే అధికారుల్లో అలజడి రేగింది.
తాడేపల్లిగూడెంలో సర్దుబాటుకు ప్రయత్నాలు
తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలో టీడీఆర్ బాండ్లు జారీచేసిన అధికారులు, లబ్ధిపొందిన బిల్డర్లు, దళారుల వెన్నులో వణుకు పుడుతోంది. కూటమి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాడేపల్లిగూడెం–భీమవరం రహదారికి ఆనుకుని 1400 చదరపు గజాల్లో టీడీఆర్ బాండ్లు జారీచేసిన అంశం ఇప్పుడు అందరి మెడకు చుట్టుకుంటోంది. ఈ ఒక్క చోటే బాండ్ల జారీలో దాదాపు 12.00 కోట్లు చేతులు మారాయి. అపార్ట్మెంట్ నిర్మాణం కోసం బిల్డర్కు స్థలం ఇచ్చిన పాపానికి భూయజమానులు నష్టపోయారు. బాండ్లు జారీ అయితే వాటిని కూడా అపార్ట్మెంట్కే వినియోగించుకోవాలని బిల్డర్తో స్థల యజమానులు ఒప్పందం చేసుకున్నారు. దానిని ఆసరాగా చేసుకుని బిల్డర్ మున్సిపాలిటీకి 1400 చదరపు గజాలను రాసిచ్చేశారు. బిల్డర్ పేరుతోనే బాండ్లు జారీచేశారు. ఇది మొదటి తప్పిదం. దానిని బిల్డర్ ఇతరులకు విక్రయించారు. ఇది రెండో పొరపాటు. వచ్చిన సొమ్ములో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధి ఖాతాలోకి జమ చేశారు. అందుకోసం కొత్త ఖాతాను సృష్టించారు. మాజీప్రజాప్రతినిధి ఖాతాలోకి వెళ్లిన తర్వాత టీడీఆర్ బాండ్ విక్రయించిన సొమ్ముల ఖాతాను రద్దు చేశారు. అంతా పక్కాగా ఉందని అధికారులు, దళారులు, వైసీపీ నేతలు భావించారు. కానీ అన్ని రికార్డులతో సహా కూటమి నేతలు సిద్ధంగా ఉన్నారు. సీబీసీఐడీ రంగంలోకి దిగితే మరింత లోతుగా దర్యాప్తు జరుగుతుంది. అందరి కథ తేలిపోతుంది. ఫలితంగా బాండ్లు జారీ చేసిన అధికారులు కూటమి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. దళారులు, బిల్డర్లు కొంత సొమ్మను స్థల యజమానులకు ఇచ్చేలా చర్చలు సాగుతున్నాయి. తణుకులోనూ టీడీఆర్ దందాపై అధికార గణంలో అలజడి పుడుతోంది. అక్కడ కూడా భూయజమానులతో ఒప్పందం చేసుకున్న వారి పేరుమీదే కంపోస్ట్ యార్డుకోసమని బాండ్లు జారీ అయ్యాయి. దాదాపు రూ. 900 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లను తణుకులో మంజూరు చేశారు. వాటిని వైసీపీ ప్రభుత్వంలోనే బ్లాక్ చేశారు. అప్పటి కమిషనర్, టీపీవోను సస్పెండ్ చేశారు. విచారణ కమిటీని నియమించారు. సదరు కమిటీ నివేదిక ఇచ్చింది. వైసీపీ హయాంలో కావాలనే కమిటీ నివేదికను తొక్కిపెట్టారు. తాడేపల్లిగూడెంలో మంజూరైన బాండ్లపైనా జిల్లా కలెక్టర్ కమిటీ నియమించారు. సదరు కమిటీ వివరాలు సేకరించింది. కానీ చర్యలు లేవు.
ప్రభుత్వ విచారణ ఎప్పుడో....
కూటమి ప్రభుత్వమే తణుకు, తాడేపల్లిగూడెంలో శాఖాపరమైన విచారణ చేపడుతుంది. ఆ తర్వాత సీబీసీఐడీ రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ విచారణ కోసం ఇప్పుడంతా ఎదురుచూస్తున్నారు. వైసీపీ హయాంలో సాగిన బాండ్ల దందాపై చర్యలు తీసుకోకపోతే మళ్లీ అదేరకమైన తప్పిదాలు చోటు చేసుకోనున్నాయి. గతంలో లబ్ధిపొందిన వైసీపీ నేతలకు నష్టమేమీ ఉండదు. పైగా కోట్లు రూపాయలు దోచుకుని దర్జా వెలగబోస్తున్నారు. విమర్శలు చేసిన కూటమి నేతలపై ఎదురుదాడి చేస్తున్నారు. టీడీఆర్ దందా బట్టబయలు చేసిన మీడియాపైనా అక్కసు వెళ్లగక్కుతున్నారు. బాండ్ల జారీలో ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సి వుంది.
ఎందుకు జారీ చేస్తారంటే...
రహదారి విస్తరణ కోసం పట్టణాల్లో టీడీఆర్ బాండ్లు మంజూరు చేస్తారు. మునిసిపాలిటీ వద్ద నిధులు ఉండవు. ప్రభుత్వం అంత పెద ్దమొత్తంలో నిధులు సమకూర్చలేదు. దాంతో గజానికి నాలుగు రెట్లు వంతున బాండ్లు మంజూరు చేస్తారు. అంటే రూ.10వేల విలువైన స్థలానికి రూ. 40వేలు విలువైన బాండ్లు జారీ కానున్నాయి. వీటిని మార్కెట్లో 40శాతానికి యజమానులే విక్రయించుకుంటారు. అంటే స్థల యజమానికి మార్కెట్ ధరకంటే అధికంగా సొమ్ములు వస్తాయి. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా మున్సిపాలిటీ రహదారి విస్తరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్థలం ఇచ్చిన యజమానులకు నష్టం ఉండదు. మున్సిపాలిటీ బాండ్ల రూపంలో యజమానులకు లబ్ధి చేకూరుస్తుంది. టీడీఆర్ బాండ్ల వల్ల ఇటు మునిసిపాలిటీలకు స్థలసేకరణలో ఆర్థిక భారం ఉండదు. కానీ తణుకులో కంపోస్ట్ యార్డు కోసం సెంట్లలో సేకరించాల్సిన స్థలాన్ని గజాల్లో సేకరించారు. బాండ్లు జారీచేశారు. తాడేపల్లిగూడెంలో రహదారి విస్తరణ జరగదని తెలిసీ కూడా అవసరం లేకుండానే మున్సిపాలిటీ స్థలాలను సేకరించింది. బాండ్లు ఇచ్చింది. స్థల యజమానులకు తెలియకుండా బిల్డర్ పేరుతో ఇచ్చేసింది. స్థలాలను స్వాధీనం చేసుకోలేదు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆలోచనలో పడింది. కొత్త మార్గదర్శకాలు విడుదల చేయడానికి సమాయత్తమైంది. టీడీఆర్ బాండ్ల జారీని నిలిపివేసింది.
స్థలాలపై కన్ను
తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో జారీ చేసిన టీడీఆర్ బాండ్లపై ప్రాథ మికంగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. బాం డ్లు జారీచేసిన స్థలాలను స్వాధీనం చేసుకున్నారా లేదా అనే విషయమై ఆరా తీస్తోంది. ఇప్పటికీ సదరు స్థలాలను స్వాధీనం చేసుకోలేదు. సదరు స్థలంలో వ్యాపారులు చేసుకుంటున్నారు. నిబం ధనలకు విరుద్ధంగానే ఓ కళ్యాణ మండ పం పేరుతో ఉన్న ఎదురు స్థలానికి తాడేపల్లిగూడెంలో బాండ్లు ఇచ్చారు. దానిని మున్సిపాలిటీ సద్వినియోగం చేసుకోవడం లేదు. రహదారి విస్తరణ ఎలాగా ఉండదు. అందుకే వైసీపీ నేత తన స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చేశారు. కూటమి నేతల ఒత్తిడితో మున్సిపాలిటీ గతంలో హద్దులు వేసింది. అంతే తప్పా అంతకు మించి చర్యలు తీసుకోలేదు. ఇటువంటి వాటిపై ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు సమాచారం.