ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు
ABN , Publish Date - Apr 05 , 2024 | 12:04 AM
రాజకీ య పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన, రెచ్చగొట్టేలా ప్రయత్నించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు.
![ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు](https://media.andhrajyothy.com/media/2024/20240326/4pedapadu2_d344aa431f.jpg)
ఎస్పీ మేరీ ప్రశాంతి
జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 4: రాజకీ య పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన, రెచ్చగొట్టేలా ప్రయత్నించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్ బూత్ లు, సమస్యలు, గత ఎన్నికల బైండోవర్, ప్రస్తుతం నమోదు చేసిన కేసులపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉద్రిక్తతలకు దారి తీయకుండా ప్రశాంతంగా ప్రచారం చేసుకోవాలన్నారు. చట్టవిరుద్ధమైన చర్యలు జరుగుతున్నా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మద్యం, నగదు అక్రమ రవాణాపై సమాచారం ఇవ్వాల న్నారు. సోషల్ మీడియా పోస్టింగ్ల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. చట్టవ్యతిరేక పోస్టుపెట్టిన, ఫార్వర్డ్ చేసిన వారిదే భాధ్యతన్నారు. కులాన్ని, మతాన్ని ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేవిధంగా అందరూ సహకరించాలని ఎస్పీ కోరారు. ఎస్పీతో డీఎస్పీ రవిచంద్ర, సీఐ రాజేష్, ఎస్ఐలు ఉన్నారు.
పెదపాడు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఓటరు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించేలా తగిన రక్షణ చర్యలు చేపడతామని ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు. పెదవేగి సీఐ కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొక్కిరపాడు, వేంపాడు గ్రామాల్లో పోలీసు, రిజర్వుడు పోలీసు సిబ్బంది గురువారం కవాతు నిర్వ హించారు. ఎన్నికల నియమావళిపై గ్రామస్తులకు, ఓటర్లకు అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు, అధికా రులు చర్యలు చేపడతారని, వారికి తగినవిధంగా సహకరించాలన్నారు. ఘర్షణలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, 144 సెక్షన్ అమల్లో వున్న నేపథ్యంలో సభలు, ర్యాలీలు నిర్వహించే ముందు అనుమతులు పొందాలన్నారు. కార్యక్రమంలో పెదపాడు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
బుట్టాయగూడెం: స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోడానికి భరోసా కల్పిస్తూ ఏజెన్సీ ప్రాంతంలో సాయుధ దళాలు కవాతు నిర్వహించారు. ఎస్సై కె.వెంకన్న దొరమామిడి, కోయఅంకంపాలెం గిరిజన గ్రామాల్లో కవాతు నిర్వహించారు. ఎన్నికల నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని ఎస్సై సూచించారు. కోడ్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.