కల్యాణ వైభోగమే..
ABN , Publish Date - Apr 18 , 2024 | 01:05 AM
జిల్లాలో బుధవారం శ్రీరామనవమిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రామాలయాలతో పాటు వాడవాడలా ప్రత్యేక వేదికలపై సీతారాముల కల్యాణం వైభవంగా జరిపించారు.
![కల్యాణ వైభోగమే..](https://media.andhrajyothy.com/media/2024/20240413/17_DTL_08_cea79e7c9f.jpg)
రమణీయం..రాములోరి కల్యాణం.. జిల్లావ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు
ద్వారకా తిరుమల/చాట్రాయి, ఏప్రిల్ 17 : జిల్లాలో బుధవారం శ్రీరామనవమిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రామాలయాలతో పాటు వాడవాడలా ప్రత్యేక వేదికలపై సీతారాముల కల్యాణం వైభవంగా జరిపించారు. పానకం, ప్రసాదాలు పంపిణీ చేశారు. పలుచోట్ల అన్నసమారాధనలు జరిగాయి. ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రానికి ఉప దేవాలయమై చినభద్రాద్రిగా పేరొందిన తూర్పు యడవల్లిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ఉంచిన సింహాసనంపై సీతారామ సమేత లక్ష్మణ హనుమాన్ విగ్రహా లను ఉంచి అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించారు. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను వంశపారంపర్య సంప్రదాయం ప్రకారం కోటగిరి వంశీయులు తీసుకురాగా ఆలయ అధికారులు పట్టువస్త్రాలను సమర్పించారు. అభిజిత్ లగ్నంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. శ్రీరామనామ స్మరణల నడుమ జరిగిన మాంగల్యధారణను కనులారా వీక్షించిన భక్తజనులు తరించారు.
చనుబండ కోదండరామస్వామి ఆలయంలో..
అపర భద్రాద్రి చనుబండ శ్రీకోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దేవస్థానం నుంచ రామలక్ష్మణ విగ్రహాలను ఒక పల్లకీలో, సీతమ్మను మరో పల్లకీలో ఉంచి మంగళవాయిద్యాల నడుమ కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. సీతారామ లక్షణుల విగ్రహాలను వేదికపై ఉంచి అర్చక స్వాములు అలయ వంశపారంపర్య ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడి దంపతులు, మరో 25 జంటల దంపతుల చేతుల మీదుగా కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. చుట్టు పక్కల మండలాలు, సరిహద్దున తెలంగాణ గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వచ్ఛంద సంస్ధల ఆధ్వర్యంలో భక్తులకు బెల్లం పానకం, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు.