పట్టిసీమ మహా శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు
ABN , Publish Date - Feb 26 , 2024 | 11:57 PM
మహా శివరాత్రి ఉత్సవాలకు పట్టిసీమ క్షేత్రంలో ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు.
పోలవరం, ఫిబ్రవరి 26 : మహా శివరాత్రి ఉత్సవాలకు పట్టిసీమ క్షేత్రంలో ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. పట్టిసీమ ఫెర్రీ రేవు భక్తుల రాకపోకలకు అనువుగా లేకపోవడంతో ఐదేళ్ళ నుంచి కన్నాపురం అడ్డ రోడ్డుకి సమీపంలో ఉన్న రివర్ ఇన్ అతిఽథి గృహం రేవు వద్ద నదిపై రాక పోకల కోసం పంట్లతో వంతెన, ఇసుక బస్తాలు, తడికలలతో నడక మార్గం వేసే పనులు వేగవంతం చేస్తున్నారు. నదికి ఆవలి వైపు నుంచి ఇసుకను డ్రెడ్జింగ్ చేసి వెదురు తడికలు బాదులతో మార్గం వేసే పనులు వేగవంతం చేశారు. నదికి ఇవతల వైపు టికెట్ కౌంటర్లు , ఇతర శాఖల అధికారుల కౌంటర్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి. ఇవతల ఒడ్డు నుంచి నదిపై 340 అడుగుల మేర ఫంట్లతో కొంతమేర వంతెన నిర్మించి నదికి అవతలి వైపు నుంచి 400 మీటర్ల మేర డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక బస్తాలు, తడికలతో నడకమార్గం ఏర్పాటు చేయనున్నారు. నది దాటిన తర్వాత సుమారు 600 మీటర్ల మేర ఇసుకతిన్నెల్లో భక్తులు నడక మార్గాన ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద ఆర్టీసీ బస్టాండు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భక్తులు ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు నదీ తీరం నుంచి ఆలయం వరకూ తీసుకెళ్ళేందుకు వాహన సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.