ఆర్టీసీ ఉద్యోగుల అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:06 AM
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పేరుతో ఆర్టీసీ ఉద్యోగు లపై విధించిన అక్రమ సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ ఆర్టీసీ గ్యారేజ్ వద్ద ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.సురేష్ అధ్యక్షతన మంగళవారం నిరసన వ్యక్తం చేశారు.

ఏలూరు గ్యారేజీ వద్ద ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
ఏలూరు కలెక్టరేట్, జూన్ 11: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పేరుతో ఆర్టీసీ ఉద్యోగు లపై విధించిన అక్రమ సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ ఆర్టీసీ గ్యారేజ్ వద్ద ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.సురేష్ అధ్యక్షతన మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్బీడీ.ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల రౌండ్టేబుల్ సమావేశంలో సమస్యలు ప్రస్తావిస్తే అది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నిజాయితీగా పనిచేస్తున్న సుందరయ్యను ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం సస్పెండ్ చేసిందని విమర్శించారు. సస్పెన్షన్ రద్దుచేసి విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఛలో ఏలూరు పిలుపునిస్తామని హెచ్చరించారు. జనవిజ్ఞాన వేదిక నాయకులు ఎస్ఎన్ రమేష్, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి టీపీఆర్ దొర మాట్లాడుతూ ఏలూరు డీపీటీవో ఆర్టీసీ ఉద్యోగులు, నాయకులపై కక్షసాధింపు చర్యలు ఆపాలని, జిల్లాలో చిన్న కారణాలతో ఉద్యోగులను సస్పెన్షన్, రిమూవల్ చేస్తున్నారని, కక్ష సాధింపు చర్యలను ఆపాలని విజ్ఞప్తి చేశారు. సోమయ్య, గోపి, కె.శ్రీనివాస్, కె.విజయలక్ష్మి, అరుణకుమారి, వివిధ డిపోల ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.