ఇక వెళ్లొస్తాం..!
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:08 AM
వారంపాటు ఎంతో సందడిగా కనిపించిన వాతావరణం బుధవారం ఒక్కసారిగా బోసిపోయింది. వచ్చిన వారంతా తిరుగుముఖం పట్టడంతో ప్రతి ఇంటిలో వెళ్లిపోతు న్నారనే బాధతో హృదయాలు బరువెక్కాయి.
ఆనందోత్సాహాలతో ముగిసిన సంక్రాంతి
భారంగా తిరుగుముఖం పట్టిన అతిథులు
వీడ్కోలు పలికిన బంధుమిత్రులు
బస్సులు, రైళ్లు కిటకిట.. ప్రత్యేక సర్వీసులు
నరసాపురం/పెదపాడు, జనవరి 17 : సంక్రాంతి పండు గకు వచ్చిన బంధుమిత్రులు, కొత్త అల్లుళ్లతో వారం రోజు లుగా పల్లెలు, పట్టణాలు కళకళలాడాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రతి ఇంటికి ఎవరో ఒకరు అతిథులుగా రావడంతో ఆనందోత్సాహాల మధ్య గడిపారు. జిల్లాలోని రహ దారులన్నీ వాహనాల రాకపోకలతో కిక్కిరిశాయి. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు సందడిగా మారాయి. ఊరూరా జరిగిన అమ్మ వారి జాతర్లలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు. పూర్వ విద్యార్థులు కలిసి యోగక్షేమాలు తెలుసుకుని, నాటి ముచ్చట్లను గుర్తు చేసుకున్నారు. గడిచిన 20 ఏళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి సంక్రాంతికి జిల్లాకు పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం. కోడి పందేల నిమిత్తం వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారి సంఖ్య రెండు లక్షలు పైనే ఉంటే.. బంధుమిత్రుల సంఖ్య ఐదారు లక్షల పైమాటేనని అంచనా. వచ్చిన వారంతా తమకు తెలిసిన ప్రతి ఒక్కరిని పలకరించి యోగ క్షేమాలు తెలుసుకుని ఆప్యాయతలను కురిపించారు. ఇలా వారంపాటు ఎంతో సందడిగా కనిపించిన వాతావరణం బుధవారం ఒక్కసారిగా బోసిపోయింది. వచ్చిన వారంతా తిరుగుముఖం పట్టడంతో ప్రతి ఇంటిలో వెళ్లిపోతు న్నారనే బాధతో హృదయాలు బరువెక్కాయి. తమ బంధు మిత్రులను సాగనంపేందుకు బస్టాండులు, రైల్వే స్టేషన్ల వరకు వచ్చి బాధతో వీడ్కోలు పలికారు. ముక్కనుమతో సంక్రాంతి పండుగ ముగియడంతో అంతా ఒక్కసారిగా తిరుగుముఖం పట్టడంతో సాయంత్రం నుంచి ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు, భీమ వరం, ఉండి, ఆకివీడు, పాలకొల్లు, నరసాపురం, తణుకు ప్రాం తాల్లో రద్దీ కనిపించింది. బస్టాండ్, రైల్వే స్టేషన్లు కిటకిటలాడా యి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ 31 ప్రత్యేక బస్సులు నడిపింది. ఇక రెగ్యులర్ రైళ్లతోపాటు నరసా పురం నుంచి వేసిన రెండు ప్రత్యేక రైళ్లు నిండుకున్నాయి. టిక్కెట్లు దొరక్క చాలామంది ఇబ్బందులు పడ్డారు. విజయ వాడ–విశాఖ వైపు వెళ్లే వాహనాలతో రోడ్లన్నీ నిండిపోయా యి. గతంలో మాదిరిగా రైల్వే శాఖ ఈ సారి ఎక్కువ స్పెషల్ సర్వీసులు నడపలేదు. నరసాపురం నుంచి మొక్కుబడిగా ఒక్క స్పెషల్ రైలు మాత్రమే నడిపింది. రెగ్యులర్ నడిచే లింగంపల్లి కాకుండా ఇది ఒక్కటే ప్రత్యేక రైలు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జనరల్ బోగీల్లో ఎక్కలేని పరిస్థితి. చాలామంది ముందుగా నరసాపు రం వచ్చి జనరల్లో ఎక్కారు. ఇక కాకినాడ నుంచి భీమవరం మీదుగా వెళ్లిన లింగంపల్లి ఎక్స్ప్రెస్ నిండుకుంది. శేషాద్రి, సర్కార్, విశాఖ, ఎల్టీటీ వంటి ముఖ్య రైళ్ళల్లో వెయిటింగ్ లిస్టులు బారులు తీరాయి. ఈ రూట్లలో రైళ్లన్నీ ముందుగా నిండుకున్నాయి. ప్రత్యేక రైళ్లు వేయకపోవడంతో బెంగళూరు, చెన్నై, ముంబయి వెళ్లే ప్రయాణీకులు రైళ్లు మారాల్సి వచ్చింది.
లక్షల్లో కార్లు
పందేల కోసం ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలపై రావడంతో గతంలో ఎన్నడూ లేనన్ని కార్లను జిల్లాలో కనిపించాయి. టోల్ ప్లాజా నిర్వాహకుల అంచనా ప్రకారం ఈసారి హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా వచ్చిన వాహనాల సంఖ్య లక్షల్లో ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. కలపర్రు, ఉంగుటూరు తదితర టోల్ ప్లాజాల వద్ద బుధవారం రద్దీ కనిపించింది. గతంలో టోల్గేట్ వద్ద టోల్ఫీజు చెల్లించేందుకు వాహనాలు బారులు తీరేవి. ఫాస్ట్టాగ్ రావడంతో వాహనం టోల్గేట్ సమీపించిన క్షణాల వ్యవధిలో వెళ్లిపోతున్నాయి.