కలెక్టరేట్లో మీకోసం.. 234 అర్జీలు స్వీకరణ
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:39 PM
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (మీకోసం)లో అధికారులకు 234 అర్జీలు అందాయి.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ
ఏలూరు రూరల్, జూలై 8: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (మీకోసం)లో అధికారులకు 234 అర్జీలు అందాయి. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ పి.లావణ్యవేణి అధికారు లకు సూచించారు. జేసీతో పాటు డీఆర్వో టి.పుష్పమణి, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయ్ రాజు, డిప్యూటీ కలెక్టర్లు భాస్కరరావు, ముక్కంటి, ఆర్డీవో కె.ఖాజావలి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులు నిర్దేశిత కాలపరిమితిలో సంతృప్తిక రమైన పరిష్కారాలు అందించాలన్నారు. రేషన్కార్డు ద్వారా అందిస్తున్న బియ్యాన్ని వేగంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
తమ భూమిని ఆక్రమించుకుని భూమిలోకి రాకుండా దౌర్జన్యం చేస్తున్నారని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండవల్లి మండలం ఉనికిలి గ్రామానికి చెంది న లక్ష్మినారాయణ అర్జీ అందజేశారు. తన భూమి వేరే వారిపేరుమీద ఆన్లైన్లో నమోదైందని, సరి చేయాలని పెదవేగి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన దుర్గారావు అర్జీ అందజేశారు. తమ పంట కొబ్బరి, నిమ్మ పంటల మధ్య నుంచి విద్యుత్లైన్ అనుమతి లేకుండా వేశారని, తమకు నష్టపరిహారం ఇప్పించాలంటూ ద్వారకాతిరుమల మండలం హెచ్.లింగపాలెంకు చెందిన శ్రీనివాసరావు కోరారు.
ఉచిత సీట్లకు ఫీజు వసూలు చేస్తున్నారు
ఏలూరు అర్బన్: ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25శాతం సీట్లను పేద, బల హీనవర్గాల కుటుంబాల పిల్లలకు ఉచితంగా కేటాయించాలన్న ఉత్తర్వులను అమ లుచేయని విద్యాసంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో జేసీకి పీడీఎస్యూ నాయకులు అర్జీ అందజేశారు. ఉచిత సీట్లకు ఫీజులు చెల్లించాలని పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయని ఆరోపించారు. భవిష్యత్లో విద్యార్థుల తల్లిదండ్రులను సమీకరించి ఉద్యమిస్తామన్నారు. జేసీని కలిసిన సంఘ నాయకుల్లో సంఘ జిల్లా అధ్యక్షుడు కె.నాని, క్రాంతి, సునీల్, తదితరులున్నారు.
జంగారెడ్డిగూడెం: ఆర్డీవో కార్యాలయంలో 9 అర్జీలు స్వీకరించినట్లు ఏవో ఎం.సోమేశ్వరరావు తెలిపారు. జీలుగుమిల్లి మండలం దర్భగూడెంకు చెందిన సమితి వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం ఇచ్చిన రెండు సెంట్ల భూమికి పట్టా ఇవ్వాలని కోరారు. మండలంలోని కేతవరం గ్రామానికి చెందిన వామిశెట్టి మణెమ్మ వృధ్ధాప్య పింఛను కోసం అర్జీ ఇచ్చారు. మున్సిపల్ కార్మికులకు ఈఎస్ఐ డిస్పెన్సరి ఏర్పాటు చేయాలని బి.బాలరాజు కోరారు.