అలంపురం పంచాయతీకి పవర్ కట్ !
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:45 PM
పెంటపాడు మండలం అలంపురం పంచాయతీలో చీకట్లు అలుముకున్నాయి. బిల్లులు చెల్లించలేదని అధికారులు కార్యాలయానికి విద్యుత్త్ నిలిపివేశారు. తాము చెప్పేది వినకుండా విద్యుత్ శాఖ అధికారులు పవర్ కట్ట చేశారని సర్పంచ్ తాతపూడి ప్రగతి ఆరోపించారు.
![అలంపురం పంచాయతీకి పవర్ కట్ !](https://media.andhrajyothy.com/media/2024/20240326/3pentapadu2_ffa7f9e511.jpg)
బిల్లులు చెల్లించలేదని సరఫరా నిలిపివేసిన అధికారులు
10.27 లక్షలు చెల్లించాలంటూ నోటీసులు
చెల్లించాల్సింది 3.55 లక్షలే : సర్పంచ్
పెంటపాడు, ఏప్రిల్ 3 :పెంటపాడు మండలం అలంపురం పంచాయతీలో చీకట్లు అలుముకున్నాయి. బిల్లులు చెల్లించలేదని అధికారులు కార్యాలయానికి విద్యుత్త్ నిలిపివేశారు. తాము చెప్పేది వినకుండా విద్యుత్ శాఖ అధికారులు పవర్ కట్ట చేశారని సర్పంచ్ తాతపూడి ప్రగతి ఆరోపించారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రూ.10,27,707 విద్యుత్త్ బకాయి చెల్లించాల్సిందిగా పంచాయతీ కార్యాలయానికి అధికారులు డిమాండ్ నోటీస్ పంపించారన్నారు. 2021 మార్చిలో 14వ ఆర్థిక సంఘం నిధులతో రూ 37,99,122 విద్యుత్ బకాయిల కోసం చెల్లించామన్నారు. వాస్తవానికి తాము అప్పుడు రూ.6 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉందన్నారు. అయితే నిధులు వెనక్కి మళ్లిపోతాయన్న ఉద్దేశంతో అదనంగా చెల్లించామన్నారు. రూ.6 లక్షలు జమ కాగా ఇంకా తమ పంచాయతీ నిధులు సుమారు రూ.32 లక్షలు విద్యుత్త్ శాఖ వద్దే ఉన్నాయన్నారు. అప్పటి నుంచి విద్యుత్ బిల్లులు పోను పంచాయితీకి సుమారు రూ.6,72,137 విద్యుత్త్ శాఖ నుంచి రావల్సి ఉందన్నారు. ఇప్పుడు రూ.10,27,707 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ నోటీస్ వచ్చిందని తమకు రావాల్సిన బకాయి పోగా ఇంకా తాము సుమారు రూ.3.55 లక్షలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఈ మొత్తాన్ని కూడా చెల్లించేందుకు ప్రయత్నించామని మార్చినెలలో 15వ ఆర్థిక సంఘానికి సంబందించిన సీఎఫ్ఎంఎస్ నుంచి చెల్లింపులు ముందుకు సాగని కారణంగా ఏప్రిల్లో అవుతుందని అధికారులు చెప్పారని అందుకే జాప్యం జరిగిందన్నారు. ఇదేమీ వినకుండా విద్యుత్త్ అధికారులు విద్యుత్త్ నిలిపివేయడం ఎంతవరుకూ సమజం అంటూ ప్రశ్నించారు.దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యదర్శి ఇలియాస్ బేగ్ మాట్లాడుతూ సొమ్ములు ట్రాన్స్ఫర్ కావడం లేదని చెప్పినా వినకుండా అధికారులు విద్యుత్ నిలిపివేశారన్నారు. దీనివల్ల కార్యాలయంలో పనులు ఏమీ జరగక చాలా ఇబ్బంది పడుతున్నామన్నారు. పింఛన్ అందించే సమ యంలో విద్యుత్ లేకపోవడం వల్ల లబ్దిదారులు కూడా ఇబ్బంది పడతారన్నారు.