Share News

ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:37 PM

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
ఏలూరులో సౌకర్యాలు పరిశీలిస్తున్న ఎస్పీ మేరీ ప్రశాంతి

జిల్లాలో పలుచోట్ల పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

ఏలూరు క్రైం, ఫిబ్రవరి 27: రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సెంట్రల్‌ ఫోర్స్‌ విభాగాలకు చెందిన సిబ్బంది సుమారు రెండు నెలలపాటు ఏలూరులో ఉండనున్నారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు నివాస భవనాల ను టూటౌన్‌ ప్రాంత పరిధిలో ఎస్పీ మేరీ ప్రశాంతి మంగళవారం పరిశీలిం చారు. భవనాల్లో మౌలిక సదుపాయాలు, ఎంత మంది సిబ్బందికి వసతి సాధ్యమనే అంశాలను స్వయంగా పరిశీలించారు. సిబ్బంది తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలపై అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. ఎస్‌బి సీఐ ఆది ప్రసాద్‌, టూటౌన్‌ సీఐ ప్రభాకర్‌ పలువురు పాల్గొన్నారు.

ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలి : ఐటీడీఏ పీవో

బుట్టాయగూడెం: పోలవరం నియోజకవర్గంలోని ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు సక్రమంగా విధులు నిర్వహించాలని రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ పీవో ఎం.సూర్యతేజ అన్నారు. ఐటీడీఏ మీటింగ్‌ హాలులో ఎన్నికల నిర్వహణపై నియోజకవర్గంలోని తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అప్పగించిన ఎన్నికల పనులను నూరుశాతం విజయవంతం చేయాలన్నారు. పొరపాట్లకు తావులేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, ఏడు మండలాల తహసీల్దార్లు, ఐటీడీఏ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాలు తనిఖీ

లింగపాలెం: బోగోలులోని పోలింగ్‌కేంద్రాలను రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో కె.అద్దయ్య తనిఖీ చేశారు. తహసీల్దార్‌ ప్రసాద్‌తో కలసి పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన భవనాల్లో పోలింగ్‌ కేంద్రాలను మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాటిని దగ్గర్లో ఉన్న సచివాలయం, రైతుభరోసా కేంద్రం, హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లోకి మార్చారు. బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 11:37 PM