నిధి లేదు.. కాగితాలే!
ABN , Publish Date - Jan 30 , 2024 | 12:43 AM
రెండు నెలల క్రితం ఆగిరిపల్లిలో ఇంటిని కూల్చివేస్తుండగా ఒక ఇనుప పెట్టె బయటపడింది. అందులో నిధి నిక్షేపాలు ఉండవచ్చన్న అపోహతో స్థానికులు అధికారులకు తెలపగా అధికారులు దానిని స్వాధీనం చేసుకుని భద్రపరిచారు.
![నిధి లేదు.. కాగితాలే!](https://media.andhrajyothy.com/media/2023/20231205/29_agp_02_19581b2524.jpg)
ఆగిరిపల్లి, జనవరి 29: రెండు నెలల క్రితం ఆగిరిపల్లిలో ఇంటిని కూల్చివేస్తుండగా ఒక ఇనుప పెట్టె బయటపడింది. అందులో నిధి నిక్షేపాలు ఉండవచ్చన్న అపోహతో స్థానికులు అధికారులకు తెలపగా అధికారులు దానిని స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. ఆగిరిపల్లికి చెందిన దేవులపల్లి శ్రీరామమూర్తికి చెందిన ఇంటిని ఎండూరి శివరాం, పార్థసారథి అనే వారికి గతంలో విక్రయించారు. ప్రస్తుతం శ్రీరామమూర్తి వారసులు అమెరికాలో నివాసం ఉంటున్నారు. అయితే ఇంటిని కొనుగోలు చేసిన వారు పాత భవనాన్ని కూల్చి వేస్తుండగా అందులో ఉన్న ఇనుప పెట్టె బయటపడడం ఆగిరి పల్లిలో కలకలం రేపింది. అయితే ఆ ఇనుప పెట్టె తాళం వేసి ఉండటం ఆ తాళం అమెరికాలో ఉన్న ఇంటిని విక్రయించిన యజమానుల వద్ద ఉండడంతో ఇప్పటి వరకు దానిని తెరవలేదు. ఇటీవల అమెరికా నంచి వచ్చిన యజమానులు ఆ తాళాన్ని స్థానిక ఎమ్మార్వో ఉదయభాస్కర్కు ఇవ్వగా అది తెరుచుకోక పోవడంతో వెల్డర్లు కష్టపడి పెట్టె బద్దలు చేశారు. అయితే అందులో కేవలం డాక్యుమెంట్స్, సత్యసాయిబాబా ఇంటి యజమాని దేవులపల్లి శ్రీరామ్మూర్తికి రాసిన ఉత్తరాలు, కొన్ని ఫొటోలు బయటపడ్డాయి. అందులో ఏమీ ఉండవని యజమానులు మొత్తుకుం టున్నా స్థానికుల కోరిక మేరకు ప్రజల సమక్షంలో బద్దలు కొట్టవలసి వచ్చింది. ఏమైనా నిధి నిక్షేపాలు ఉంటాయని ఆత్రుతతో ఎదురుచూసిన స్థానికులకు అందులో ఏమీ లేకపోవడంతో నిరాశ ఎదురైంది.