కొల్లేరు కనువిందు..
ABN , Publish Date - Jan 11 , 2024 | 12:31 AM
కొల్లేటి సరస్సులో కొంగలు కనువిందు చేస్తున్నాయి. ఖండాంతరాలు దాటి కొల్లేటి తీరానికి వందలాది రకాల పక్షలు వేలాదిగా తరలివచ్చాయి.
![కొల్లేరు కనువిందు..](https://media.andhrajyothy.com/media/2023/20231205/9kklr04_42163aa92f.jpg)
విదేశీ పక్షుల సందడి
కైకలూరు, జనవరి 10 :
కొల్లేటి సరస్సులో కొంగలు కనువిందు చేస్తున్నాయి. ఖండాంతరాలు దాటి కొల్లేటి తీరానికి వందలాది రకాల పక్షలు వేలాదిగా తరలివచ్చాయి. విహంగాల కిలకిలరావాలు.. ఎన్నో రకాల చేపలు, పచ్చని మొక్కలు.. సరస్సులో అరవిరిసిన కలువల అందాలు.. పర్యావరణ ప్రేమికులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. స్వదేశీ, విదేశీ పక్షుల విడిది కేంద్రం. ఇక్కడ 185 రకాల పక్షులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో అత్యధికంగా వలస పక్షులుగా పేరొందిన పెలికాన్, పెయింటెడ్ స్టాక్ ప్రాముఖ్యత సంతరించు కున్నాయి. సైబీరియా, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ కొల్లేరు సరస్సుకు చేరుతాయి. ఈ పక్షులు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. బోటులో ప్రయాణిస్తూ వాటిని అత్యంత దగ్గరగా తిలకిస్తూ పిల్లలు కేరింతలు కొడుతున్నారు. ఈ సంవత్సరం పెలికాన్, పెయింటెడ్ స్టాక్, తెల్ల కంకణాలు, నల్లకంకణాల పిట్టలు, జమ్ముకోడి, గ్రేహెరాయిన్ (నారాయణపక్షి) పరద పిట్టలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో పర్యాటకులు పెద్దఎత్తున కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రాన్ని సందర్శిస్తున్నారు. కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు.