ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:03 AM
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టరు ప్రవీణ్ ఆదిత్య అధి కారులను ఆదేశించారు.
భీమవరం, మార్చి 28 : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టరు ప్రవీణ్ ఆదిత్య అధి కారులను ఆదేశించారు. కలెక్టరేటులో గురువారం జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రసుత్త 2023–24 రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అందించాలని, పంట అంచనా 9.45 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కాగా,7.50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ లక్ష్యం ఉందన్నారు. రైతులకు ఏటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో 324 రైతు భరోసా కేంద్రాలను సిద్ధం చేశామని. ధాన్యం తరలించడానికి ఇప్పటికే 1 కోటి 80 లక్షలు గోనె సంచులు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో 211 పెద్ద,చిన్న రైసు మిల్లులకు కస్టోడియన్ అధికారులను నియ మించామని ధాన్యం తరలించడానికి 2,600 వాహనాలను సిద్ధం చేశామన్నారు. ఆర్డీవోలు కె.శ్రీనివాసులు రాజు, అచ్యుత అంబరీష్, కె.చెన్నయ్య, సివిల్ సప్లై జిల్లా మేనేజరు టి.శివరామ ప్రసాదు, డీఎస్వో సరోజ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా కోపరేటివ్ అధికారి నాగరాజు, పాల్గొన్నారు.