ఏజెన్సీలో వైద్య సౌకర్యాలు పెంచేందుకు కృషి చేస్తా
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:07 AM
‘ఏజెన్సీలో వైద్య సౌకర్యాలు ఇంకా పెంచేందుకు కృషి చేస్తా.. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటుపై మరోసారి ప్రతిపాదన పంపుతా.. పీహెచ్సీల్లో మెరుగైన వైద్య సేవలు, సౌకర్యాలు కల్పన, మరింత వైద్యం అందుబాటులో తెచ్చేందుకు మొబైల్ అంబులెన్స్లు, గిరిజనుల్లో సాధారణ ప్రసవాలపై అవగాహన పెంపు, మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేలా అటవీశాఖాధికారులతో మాట్లాడుతా’ అని కేఆర్ఫురం ఐటీడీఏ పీవో సూర్యతేజ అన్నారు.
ఐటీడీఏ పీవో సూర్యతేజ
కుక్కునూరు, జనవరి 28 : ‘ఏజెన్సీలో వైద్య సౌకర్యాలు ఇంకా పెంచేందుకు కృషి చేస్తా.. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటుపై మరోసారి ప్రతిపాదన పంపుతా.. పీహెచ్సీల్లో మెరుగైన వైద్య సేవలు, సౌకర్యాలు కల్పన, మరింత వైద్యం అందుబాటులో తెచ్చేందుకు మొబైల్ అంబులెన్స్లు, గిరిజనుల్లో సాధారణ ప్రసవాలపై అవగాహన పెంపు, మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేలా అటవీశాఖాధికారులతో మాట్లాడుతా’ అని కేఆర్ఫురం ఐటీడీఏ పీవో సూర్యతేజ అన్నారు. కుక్కునూరు మండలం జిన్నెలగూడెం వలస ఆదివాసీ మహిళ కూరం కోసి అనే గర్భిణి డోలీలో నాలుగు కిలోమీటర్ల మేర ప్రయాణించి కుక్కునూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన విషయం విధితమే. ఈ క్రమంలో కుక్కునూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఆమెను ఆదివారం ఆయన పరామర్శించారు. జరిగిన ఘటనపై ఆమె నుంచి పలు విషయాలు అడిగారు. సకాలంలో స్పందించిన వైద్య సిబ్బందిని ప్రశంసించారు. ఈ క్రమంలో 2014లో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని నాలుగు పీహెచ్సీలకు అనుసంధానంగా కుక్కునూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వం చేసిందని అది ముందుకు సాగడం లేదని, రెండు మండలాల ప్రజలు మెరుగైన వైద్యం కోసం వెళ్లాలంటే 50 నుంచి 70 కిలోమీటర్లు అటు తెలంగాణలోని భద్రాచలం, ఇటు ఆంధ్రలోని జంగారెడ్డిగూడెం వెళ్లాల్సి వస్తొందని పలువురు విలేకర్లు ఆయన దృష్టికి తీసుకురాగా పైవిధంగా ఆయన స్పందించారు. అనంతరం కుక్కునూరులోని గిరిజన బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. పలువురు విద్యార్థులు వసతి గృహంలో ఉండకపోవడాన్ని గుర్తించారు. డిప్యూటీ డీఎంహెచ్వో మేరీ క్యాథలిన్, డాక్టర్ పూర్ణశ్రీనివాస్, డాక్టర్ రమేష్, వైసీపీ నాయకులు రావు వినోద్, రాము తదితరులు ఉన్నారు.