రాత్రివేళ దర్జాగా తవ్వేశారు..
ABN , Publish Date - Mar 16 , 2024 | 12:23 AM
జీలుగుమిల్లి మండలంలో మట్టి మాఫియాకు అధికార పార్టీ నాయకులు తెర తీశారు. తాటియాకులగూడెం బుడుగుల చెరువు సమీపంలో గట్టు నుంచి మట్టిని తవ్వి తరలించేశారు.
![రాత్రివేళ దర్జాగా తవ్వేశారు..](https://media.andhrajyothy.com/media/2024/20240313/15jml01_632f3c5bf6.jpg)
తాటియాకులగూడెంలో అక్రమంగా మట్టి తవ్వకాలు
జీలుగుమిల్లి, మార్చి 13: జీలుగుమిల్లి మండలంలో మట్టి మాఫియాకు అధికార పార్టీ నాయకులు తెర తీశారు. రేపో మాపో ఎన్నికల కోడ్ వస్తుందని భావించిన అధికార పార్టీ మండల నాయకుడి అస్మదీయులు కొందరు, వార్డు మెంబర్లకు ప్రస్తుతం పార్టీ నుంచి ఎటువంటి ఆదాయం లేకపోవడంతో మట్టే ఆదాయ వనరుగా మారింది. తాటియాకులగూడెం బుడుగుల చెరువు సమీపంలో గట్టు నుంచి మట్టిని తవ్వి తరలించేశారు. రాత్రికి రాత్రి మూడు ఎక్స్కవేటర్లు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఏర్పాటు చేసి రూ. పది లక్షల విలువ చేసే మట్టిని అక్రమంగా అమ్ముకున్నారని స్థానికంగా చర్చ సాగుతోంది.జీలుగుమిల్లి, తాటియాకులగూడెం, కామయ్య పాలెంకు చెందిన పలువురు అధికార పార్టీ కార్యకర్తల ఇళ్ల వద్ద ఖాళీ జాగాల్లో ఇళ్ల నిర్మాణ స్థలాల యజమానులతో ముందుగా బేరం కుదు ర్చుకుని అడ్వాన్స్లు తీసుకుని అక్రమంగా మట్టిని తోలారు.కొందరు స్థానికులు అక్రమ మట్టి తవ్వకాలపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిఘా వర్గాలు ఆరా తీశాయి. ఆ సమయంలో అధికార పార్టీ నేత వారికి ఫోన్ చేసి మట్టి తోలకం ఆపి వేస్తున్నట్టు చెప్పడంతో కేసులు నమోదు కాకుండా చేశారు. కొద్దిసేపు వాహనాలు నిఘా వర్గాలు వెళ్లిన తర్వాత మరల మట్టి తోలకాలు చేపట్టి శుక్రవారం తెల్లవారే వరకు తోలారు.