హెల్మెట్ ధరించాల్సిందే
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:47 PM
రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా హెల్మెట్ ధరించడం ద్విచక్ర వాహనదారులకు క్షేమమని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ అన్నారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్
ఏలూరు క్రైం, జూలై 5 : రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా హెల్మెట్ ధరించడం ద్విచక్ర వాహనదారులకు క్షేమమని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ అన్నారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనంలో శుక్రవారం ట్రాఫిక్, ట్రాన్స్పోర్టు అధికారులైన ట్రాఫిక్ సీఐ కె.శ్రీనివాసరావు, రీజినల్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్ కె.శ్రీహరిలతో కలిసి హైకోర్టు ఆదేశాలను అను సరించి ద్విచక్ర వాహనదారుల భద్రతకు సంబంధించి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో రత్న ప్రసాద్ మాట్లాడుతూ గతేడాది రాష్ట్రంలో జరిగిన 3,703 ద్విచక్ర వాహన ప్రమాదాల్లో 3,042 మరణించగా వీరిలో 85 శాతం మంది హెల్మెట్ ధరించకపోవడంతోనే మృతి చెందారన్నారు. వాహన దారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ హెల్మెట్ను ధరించి ప్రయాణం చేయాలన్నారు. రోడ్డు భద్రత నియమాలకు, ప్రమా దాలకు సంబంధించి విరివిగా ప్రచార కార్యక్రమాలు, అవగాహన సదస్సులు సంబంధిత ట్రాన్స్పోర్టు, పోలీస్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేసి హెల్మెట్ లేనివారిపై కేసులు నమోదు చేయడానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. జాతీయ మోటారు వాహన చట్టంలోని రూల్ 167(ఎ) ప్రకారం రోడ్డు భద్రతకు సంబంధించి ఎలక్ర్టానిక్ పరికరాలైన స్పీడ్ కెమెరా, క్లోజ్డ్ సర్య్కూట్, టెలివిజన్ కెమెరా, స్పీడ్గన్, బాడీ వెరిబుల్ కెమెరా తదితర టెక్నాలజీ పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతకు వాడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ కె.శ్రీనివాసరావు, ఆర్టీవో శ్రీహరిలు మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహన దారుడు హెల్మెట్ను తప్పనిసరిగా ధరిం చాలన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారణలో భాగంగా తనిఖీలు ముమ్మరం చేసి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ నరేంద్ర బాబు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.