వికసిత పాలన
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:25 AM
కూటమి ప్రభుత్వంలో గ్రామపాలన వికసించింది. ప్రజలకు భాగస్వామ్యం లభించింది. పల్లె జనం అనుమతితో అభివృద్ధి పనులకు ఆమోదముద్ర పడింది. ప్రభుత్వ పిలుపు మేరకు జిల్లాల్లోని 409 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించారు.
గ్రామసభలు సూపర్ సక్సెస్
జోరువానలో సాగిన ఉపాధి సభలు
సమస్యలను ప్రస్తావించిన ప్రజలు
పరిష్కారానికి ఎమ్మెల్యేలు, అధికారుల హామీ
సభల విజయవంతంపై అంతటా హర్షం
భీమవరం టౌన్, ఆగస్టు 23 : కూటమి ప్రభుత్వంలో గ్రామపాలన వికసించింది. ప్రజలకు భాగస్వామ్యం లభించింది. పల్లె జనం అనుమతితో అభివృద్ధి పనులకు ఆమోదముద్ర పడింది. ప్రభుత్వ పిలుపు మేరకు జిల్లాల్లోని 409 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించారు. జనం పెద్ద ఎత్తున హాజరయ్యారు. గ్రామంలోని సమస్యలను విన్నవించుకున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గ్రామసభల్లో పాల్గొన్నారు. కూటమి పార్టీల నియోజకవర్గ ఇన్ఛార్జులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు హాజరయ్యారు. ఐదేళ్లుగా ఎదురవుతున్న ప్రజా సమస్యలపై గొంతు విప్పారు. రహదారులు, డ్రైన్లు, మంచినీరు, వీధి దీపాల వంటి వాటిని ప్రస్తావించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పనులకు నిదులు కేటాయించినట్లు ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు వివరించారు. పాలకొల్లు రూరల్ మండలం లంకలకోడేరులో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్ చదలవాడ నాగరాణి హాజరయ్యారు. వీరవాసరంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు), కలెక్టర్తో కలిసి సభలో పాల్గొన్నారు. ఉండికి సంబంధించి జేసీ రాహుల్కుమార్రెడ్డి, జనసేన నాయుడు జుత్తిగ నాగరాజు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి, కూటమి నాయకులు పాల్గొన్నారు. నరసాపురంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ నాయకుడు పొత్తూరి రామరాజు పాల్గొన్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ గ్రామసభలకు అనుకున్న స్థాయిలో ప్రజలు భాగస్వామ్యం కావడంతో నాయకులలో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఐదేళ్లుగా పంచాయతీలు ఎలా నిర్వీర్యమయ్యాయో ప్రజా ప్రతినిధులు ప్రజలకు వివరించారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఐకమత్యంతో ముందుకు వెళితేనే సాధ్యమవుతుందని అన్నారు.
పంచాయతీలకు ఊపిరి పోస్తున్నాం
మంత్రి నిమ్మల
పాలకొల్ల్లు రూరల్, ఆగస్టు 23 : వైసీపీ ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేస్తే, నేడు ఎన్డీఏ ప్రభుత్వం ఊపిరి పోస్తోందని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. లంకల కోడేరులో శుక్రవారం జరిగిన ఉపాధి హామీ పథకం గ్రామ సభలో మంత్రి మాట్లాడారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 2014–19ల్లో పంచాయతీల ఆదాయం రూ.240 కోట్లు. 2019–23 నాటికి రూ.170 కోట్లకు పడిపోయింది. గత ప్రభత్వం పంచాయతీలను విస్మరిస్తే మేం కూటమి ప్రభుత్వం జవసత్వాలను కల్పిస్తున్నాం. పంచాయతీలకు తొలి విడతగా రూ.1,400 కోట్లు విడుదల చేశాం’ అని తెలిపారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి మాట్లాడుతూ ఉపాధి హామీలో భాగంగా కార్మికులకు 15 రోజుల్లోగా నగదును వారి బ్యాంక్ ఖాతా లకు జమ చేస్తామన్నారు. ఆర్డీవో ఎం.అ చ్యుత అంబరీష్, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, డ్వామా పీడీ ఎం.ప్రభాకర రావు, పంచాయతీరాజ్ జిల్లా అధికారి ఎస్.శ్రీనివాసరావు, లేబర్ కమిషనర్ ఎ.లక్ష్మి, తహశీల్దార్ వై.దుర్గాకిశోర్, ఎంిపీడీవో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జనం ఆగ్రహం.. వెళ్లిపోయిన సర్పంచ్
నత్తా రామేశ్వరంలో గత ఏడాది నిర్మించిన రహదారులు ప్రజలకు ఉపయోగం లేదని, నివాస ప్రాం తాలు లేని ప్రాంతాల్లో వీటిని నిర్మించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ దృష్టికి తెచ్చారు. దీంతో వేదికపైన వున్న గ్రామ సర్పంచి గలగల ధర్మారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.