మాకు న్యాయం చేయండి
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:17 AM
జంగారెడ్డి గూడెం మండలం పేరంపేట– పంగిడిగూడెం మధ్యలో గ్రీన్ఫీల్డ్ హైవే అండర్ పాస్ వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం టెంటు వేసి పనులను అడ్డుకుని ధర్నా నిర్వహించారు.

గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల ధర్నా
జంగారెడ్డిగూడెం, మార్చి 5 : గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు రోడ్డెక్కారు. జంగారెడ్డి గూడెం మండలం పేరంపేట– పంగిడిగూడెం మధ్యలో గ్రీన్ఫీల్డ్ హైవే అండర్ పాస్ వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం టెంటు వేసి పనులను అడ్డుకుని ధర్నా నిర్వహించారు. న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి హైవే పనులు అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా రైతులు ఆందోళన సాగించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే కోసం రైతులకు అతి తక్కువ పరిహారం ఇచ్చి బల వంతంగా భూములు లాక్కోవడం దారుణమ న్నారు. ఆర్బిట్రేషన్ ద్వారా పరి హారం పెంచి ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చి విచారణ పూర్త యినా ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్స్ ఇవ్వక పోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. హైవే పనుల వల్ల దుమ్ము ధూళితో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. బోర్లు కోల్పోయిన వారికి జలకళ పథకంలో బోర్లు వేయా లని, సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలని, సర్వీస్ రోడ్లు బీటీ రోడ్లుగా నిర్మాణం చేయాలని, భూమి ఒకవైపు బోర్ ఒక వైపు ఉన్న రైతులకు హైవే కింద నుంచి ప్లాస్టిక్ పైపులు అమర్చాలని కోరారు. ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాం బాబు, గ్రీన్ ఫీల్డ్ భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు గోలి నర్సిరెడ్డి, వందనపు సాయిబాబా, పి.సోమిరెడ్డి, పి.సత్తిరెడ్డి, గూడపాటి శ్రీనివాసరావు, పరిమి రామారావు, ఆలపాటి మురళి, కొట్టు కనక నరసింహారావు, పుసులూరి శ్రీహరి, పల్లి వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సొంగా రోషన్ కుమార్, రావూరి కృష్ణ, పెనుమర్తి రామ్కుమార్ రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.