అనాథ బాలికలతో ఎన్నికల ప్రచారంపై విచారణ
ABN , Publish Date - Apr 22 , 2024 | 12:43 AM
నూజివీడు వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనాథ బాలికల వ్యవహారంపై ఆదివారం అధికారులు విచారణ చేపట్టారు.
![అనాథ బాలికలతో ఎన్నికల ప్రచారంపై విచారణ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నూజివీడు, ఏప్రిల్ 21: నూజివీడు వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనాథ బాలికల వ్యవహారంపై ఆదివారం అధికారులు విచారణ చేపట్టారు. శుక్రవారం రాత్రి నూజివీడు మండలం పాతరావిచర్ల గ్రామంలో అనాథ బాలిక లకు వైసీపీ జెండాలు కప్పి తలకు టోపీలు పెట్టి వైసీపీ కార్యకర్తల్లా వారితో వైసీపీ నాయకుడు బసవరాజు నగేష్ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేయించా రు. ఆ రోజు గ్రామంలో అభ్యర్థి ప్రతాప్ ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ విష యం వెలుగులోకి రావడం, జనసేన నాయకులు ఎన్నికల అధికారిణి అయిన ఆర్డీవో వై.భవానీశంకరికి శనివారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఆమె విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా ఆదివారం ఉదయం నూజివీడు పురపాలక కమిషనర్ రామిరెడ్డి, పురపాలక అధికారి నాగరాజు, బసవరాజు నగేష్, స్నేహా రైడ్స్ పేరుతో నిర్వహిస్తున్న బాలికల వసతి గృహానికి వెళ్ళి విచారణ నిర్వహించారు. నివేదికను ఆర్వోకు సమర్పిస్తామని వారు తెలిపారు.