సూరి భగవంతం స్మారక కేంద్రం ఏర్పాటు చేస్తా
ABN , Publish Date - Oct 15 , 2024 | 01:27 AM
భారత రక్షణ క్షిపణి రంగానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన మహనీయుడు డాక్టర్ సూరి భగవంతం అని, ఆయన మన ప్రాంతం వారు కావడం మనకెంతో గర్వకారణమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
ఆగిరిపల్లి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): భారత రక్షణ క్షిపణి రంగానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన మహనీయుడు డాక్టర్ సూరి భగవంతం అని, ఆయన మన ప్రాంతం వారు కావడం మనకెంతో గర్వకారణమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. డీఆర్డీవో పూర్వ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సూరి భగవంతం 115వ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని సోమవారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, డీఆర్డీవో పూర్వ చైర్మన్ డా.జి. సతీష్రెడ్డితో కలిసి మంత్రి పార్థసారథి శ్రీ శోభనాద్రి లక్ష్మీ నరసింహ వేదశాస్త్ర పాఠశాల ఆవరణలో ఆవిష్కరించారు. అలాగే సూరిభగవంతంపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ నూజివీడులో డా.సూరి భగవంతం స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని, వేద పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. డా.సూరి భగవంతం ఫౌండేషన్ ఫౌండర్ డైరెక్టర్ ఎస్.బి. రామ్, నేషనల్ బుక్ట్రస్ట్ సభ్యులు జి.వల్లీశ్వర్, నూజివీడు ఆర్డీవో వాణి, పంచాయతీరాజ్ ఈఈ బాపిరెడ్డి, వేద పాఠశాల కార్యవర్గ సభ్యులు సూరిశర్మ, సలాక రఘునాథ శర్మ, దోర్భల ప్రభాకర శర్మ తదితరులు పాల్గొన్నారు.