జైశ్రీరాం..జైశ్రీరాం..
ABN , Publish Date - Apr 13 , 2024 | 11:53 PM
జంగారెడ్డి గూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో గోటి తలంబ్రాలతో జంగారెడ్డిగూడెం నుంచి భద్రాద్రికి 23వ పాదయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది.
![జైశ్రీరాం..జైశ్రీరాం..](https://media.andhrajyothy.com/media/2024/20240413/13jrg01_67c4f55888.jpg)
గోటి తలంబ్రాలతో భద్రాదికి రామభక్తుల పాదయాత్ర
బుట్టాయగూడెం, ఏపిల్ర్ 13 : శ్రీరామ నామ స్మరణతో జంగారెడ్డిగూడెం పట్టణం మోరు మోగింది. జైశ్రీరాం.. జైశ్రీరాం అంటూ భక్తులు ఒకరి వెంట ఒకరు పాదయాత్రగా కదిలారు. కిలోమీటర్ల మేర ఆ మహాపాదయాత్రను చూసేందుకు పాదయాత్ర సాగే సమీప గ్రామాల ప్రజలంతా రోడ్లపైకి వచ్చారు. పాదయాత్ర చేసే భక్తులకు అల్పాహారం, మజ్జిగ, మంచినీరు అందిస్తూ మార్గమద్యలో ఆహ్వానం పలికి సేవ చేసుకున్నారు. జంగారెడ్డి గూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో గోటి తలంబ్రాలతో జంగారెడ్డిగూడెం నుంచి భద్రాద్రికి 23వ పాదయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీరామ నవమి రోజున సీతారాముల కల్యాణం వేడుకలకు గోటితో ఒలిచిన తలంబ్రాలు అందించేందుకు మహా పాదయాత్రగా బయలుదేరారు. ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ సారధ్యంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. పాదయాత్రను ప్రముఖ వ్యాపార వేత్త చామర్తి శ్రీరాములు ప్రారంభించగా శ్రీరామరథానికి సినీ గేయ రచయిత, తపన ఫౌండేషన్ ప్రతినిధి అనంత శ్రీరామ్ పూజలు నిర్వహించారు. సామాజిక వేత్త కెఎల్ఎన్ ధనకుమార్ గోటితలంబ్రాల ప్రాశస్త్యం వివరించారు. శ్రీవల్లీ దేవసేన సహిత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ కమిటీ అల్పాహారం, చోడుజావ పంపిణీ చేశారు.