కూటమి గెలుపుతోనే రాష్ట్ర, దేశాభివృద్ధి
ABN , Publish Date - Apr 24 , 2024 | 12:52 AM
కూటమితోనే రాష్ట్ర, దేశాభివృద్ధి సాధ్యపడుతుందని ప్రజలంతా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ అన్నారు.
కైకలూరు, ఏప్రిల్ 23: కూటమితోనే రాష్ట్ర, దేశాభివృద్ధి సాధ్యపడుతుందని ప్రజలంతా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ అన్నారు. మంగళవారం కైకలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే కొల్లేరు సమస్యల పరిష్కారం, అలాగే ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశముంటుందన్నారు. ఇప్పటికే కామినేని ఇక్కడ ఆక్వా పరిస్థితులను, కొల్లేరు సమస్యలను తనకు వివరించారని వీటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కాగా కామినేని శ్రీనివాస్ నామినేషన్ పర్వం కోలాహలంగా జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా 25 వేల మంది ప్రజలు వాహనాల్లో పెద్దఎత్తున తరలిరావడంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు కైకలూరు పట్టణంలో ఎన్డీయే కూటమి జెండాలు రెపరెపలాడాయి. కైకలూరు మండలం వరహాపట్నం నుంచి వేలాది మంది అభిమానులు, కార్యకర్తల నడుమ ప్రచార రథంపై ఊరేగుతూ మంత్రి ఎల్. మురుగన్, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, మాజీ ఎంపీపీ నర్సిపల్లి అప్పారావుతో కలసి కైకలూరు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న కామినేని కైకలూరు రిటర్నింగ్ అధికారి కె. భాస్కర్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎంచుకున్న ముహూర్తం ప్రకారం 10.48లకు ఆర్వో సమక్షంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి 11.15లకు అందజేశారు.