డయేరియా కలకలం
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:32 AM
డయేరియా లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందడంతో నూజివీడు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

నూజివీడులో ఒకరి మృతి
చికిత్స పొందుతున్న పలువురు
నూజివీడు టౌన్, మార్చి 5 : డయేరియా లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందడంతో నూజివీడు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని జంగాలపేటకు చెందిన మద్దిరాల తాతయ్యబాబు (40) సోమవారం వాంతులు, విరేచనాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఇదే ప్రాంతంలో సుమారు 20 మంది వాంతులు, విరేచనాలతో బాధ పడుతున్నారని స్థానికులు తెలిపారు. ఎం.త్రినయని, ఎం.లక్ష్మి, పి.పుల్లమ్మ స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డయేరియా లక్షణాలతో బాధపడుతున్న వారిలో అత్యధికులు వయోవృద్ధులు, చిన్నారులు ఉన్నారు. వారు వ్యాధి లక్షణాలను తట్టుకోలేక మరింత నీరస పడుతున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిపై ఆగ్రహం
తాతయ్యబాబు మృతితో జంగాలపేట, చాకలి బజార్లలో మంగళవారం సర్వేకు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిపై స్థానికులు, ఆగ్రహం వ్యక్తంచేశారు. డయేరియా లక్షణాలతో మృతి చెందినా కనీసం వైద్య ఆరోగ్యశాఖ పట్టించుకోని పరిస్థితి ఉందని, అదేమంటే పల్స్పోలియో పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నా రని మండిపడ్డారు. జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చి డయేరియా లక్షణాలకు గల కారణాలను తెలుసుకునే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.