కౌంటింగ్ టెన్షన్ .. !
ABN , Publish Date - May 26 , 2024 | 12:23 AM
పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మరో పది రోజుల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పుడు అదే పోటీ చేసిన అభ్యర్థుల్లోనూ, ఏర్పాట్లు చేస్తున్న అధికారుల్లోనూ టెన్షన్కు దారితీస్తోంది.
మరో పది రోజుల్లోనే ఓటరు తీర్పు
ఈలోపే ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు
ప్రతి నియోజకవర్గానికి ఒక హాలు..14 టేబుళ్లు
పోలింగ్ కేంద్రాలను బట్టి రౌండ్ల నిర్దేశం
మధ్యాహ్నం 2 గంటల్లోపే లెక్కింపు ముగిసేలా వ్యూహం
తొలి గంటలోనే పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తి
(ఏలూరు– ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మరో పది రోజుల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పుడు అదే పోటీ చేసిన అభ్యర్థుల్లోనూ, ఏర్పాట్లు చేస్తున్న అధికారుల్లోనూ టెన్షన్కు దారితీస్తోంది. ఎట్టి పరిస్థితు ల్లోనూ వచ్చేనెల 4న ఓట్ల లెక్కింపులో వేగంగా వ్యవహరించడం, వివాదాలకు తావు లేకుండా మధ్యాహ్నం నాటికే ఫలితాలు వెలువరించేలా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. నియోజక వర్గాల వారీగా ఇప్పటికే కౌంటింగ్ ఏర్పాట్లను ముమ్మరం చేసి అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం తొలి 2 గంటల్లో పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తి చేయడం, సమాంతరంగా ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు కొనసాగించడంతో పాటు ఫలితాలు 10 గంటల్లోపే రౌండ్ల వారీగా ప్రారంభమయ్యేలా చూడాలని భావిస్తున్నారు.
నియోజకవర్గానికి 14 టేబుళ్లు
వచ్చేనెల 4న ఓట్ల లెక్కింపునకు వీలుగా ఎన్నికల కమిషన్ నియమా వళి ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపునకు అనువుగా ఒక్కో హాల్ను ఎంపిక చేశారు. ఏలూరు లోక్సభ స్థానం పరిధిలో ఏలూరుతో పాటు దెందు లూరు, చింతలపూడి, పోలవరం, ఉంగుటూరు, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలు ఉండగా, వీటన్నింటికి విడివిడిగా ఏడు హాళ్లను కేటా యించారు. ప్రతి హాల్లోను 14 టేబుళ్లను ఏర్పాటు చేసి వీటన్నింటిని కలిపి ఒక రౌండ్గా ఓట్ల లెక్కింపు సాగబోతోంది. పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి, ఓట్ల సంఖ్యను బట్టి రౌండ్లను ప్రామాణికంగా ఎంపిక చేస్తున్నారు. ఏలూరు నియోజకవర్గంలో సుమారు 213 పోలింగ్ కేంద్రా లు ఉన్నాయి. దీన్నిబట్టే ఓట్ల లెక్కింపు పదినుంచి 12 రౌండ్ల లోపే పూర్తవుతుందని ఒక అంచనా. ఉంగుటూరు నియోజకవర్గంలో 214 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఏలూరు తరహాలోనే ఇక్కడ కూడా కౌంటింగ్ వేగంగా సాగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి సమాంతరంగా, వేగంగా కొనసాగించడం వీలైతే మధ్యాహ్నం 2 గంటల్లోపే కౌంటింగ్ ప్రక్రియ యావత్తు పూర్తయ్యేలా చూడాలని భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఇంతకు ముందు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఆసాంతం పూర్తయిన తరువాతే మిగతా ఓట్ల లెక్కింపును ఆరంభించేవారు. కాని ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు నమోదైన 15,615 పోస్టల్ బ్యాలెట్ను సాధ్యమైనంత మేర త్వరత్వరగా లెక్కింపు పూర్తి చేయాలని భావిస్తు న్నారు. పెద్దమొత్తంలో పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి కాబట్టి వీటిని రెండు రౌండ్లుగా చేసి లెక్కిస్తే ఓట్ల లెక్కింపు త్వరితగతిన పూర్తవుతుందన్న అంచనాకు వచ్చారు. మరోవైపు పోస్టల్ ఓట్ల లెక్కింపు కొనసాగిస్తూనే సమాంతరంగా ఈవీఎంల ఓట్ల లెక్కింపును చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. వీటన్నింటిపైన రెండు, మూడురోజుల్లోనే ఎన్నికల అధి కారులు స్పష్టత ఇవ్వబోతున్నారు. ఓట్ల లెక్కింపులో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యధిక పోలింగ్ కేంద్రాలు కలిగిన పోలవరం, నూజివీడు నియోజకవర్గాలకు సంబంధించి లెక్కింపు వేగంగా సాగేలా రౌండ్లసంఖ్య ఇప్పటికే దాదాపు నిర్ధారణ అయింది. 15 నుంచి 20 రౌండ్లు మేర రౌండ్ ఒక్కింటికి పది నుంచి 15 వేల ఓట్లు ఉండేలా జాగ్రత్త పడబోతున్నారు. ఈ రెండు నియోజక వర్గాలు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కావడానికి మిగతా ఐదు నియోజకవర్గాలు కంటే ఎక్కువ సమయం తీసుకోవచ్చని దాదాపు మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వీటి ఫలితాలు తుదిదశకు చేరుకో వచ్చని భావిస్తున్నారు. ఎన్నికల అధికారులు మాత్రం నియోజకవర్గాల వారీగా కైకలూరులో 235 పోలింగ్ కేంద్రాలు, దెందులూరులో 239 కేంద్రాలు, చింతలపూడిలో 273 కేంద్రాలు, పోలవరంలో 284, నూజి వీడులో 286 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ పోలింగ్ కేంద్రాలు తక్కువ ఉంటాయో? ఆ నియోజక వర్గాల్లో ఫలితాలు ముందుగా వెలువడే అవకాశం ఉన్నట్టు అంచనాకు వచ్చారు.
కౌంటింగ్ ఏజెంట్లకు అభ్యర్థుల శిక్షణలు
ఓట్ల లెక్కింపులో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురుకాకుండా అభ్య ర్థులంతా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడికక్కడ కౌంటింగ్ ఏజెంట్లను అప్రమత్తం చేశారు. వారికి తగిన శిక్షణ ఇచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. కౌంటింగ్లో అత్యంత కీలకమైన 17సీ పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిం చడం, ఈవీఎం మిషన్లకు వేసిన సీల్ పరిశీలనపై ఇప్పటికే ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. వాస్తవానికి గతంలోనూ పోస్టల్ బ్యాలెట్లలో అనేకం వీగిపోయాయి. ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఉద్యోగులే తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అప్పట్లో ఓటు వీగిపోవడానికి దారి తీసింది. ఇప్పుడు కూడా ఒకవేళ అర్హత ఉన్నా ఏదోసాకుతో పోస్టల్ బ్యాలెట్ను పక్కన పెడతారనే అనుమానం కొంతమంది అభ్యర్థుల్లో ఉంది. దీనికి తగ్గట్లుగానే ప్రతి విషయాన్ని క్షుణంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఓట్ల లెక్కింపులో ఏమరపాటు తగదని పదేపదే క్లాసులు పీకుతున్నారు. ప్రత్యేకించి ఎలక్ర్టానిక్ మిషన్లలో మొత్తం పోలైన ఓట్లను లెక్కించిన ఓట్లు సంఖ్యతో సరిచూసుకోవాలని, కౌంటింగ్ తుది దశకు వచ్చినా ఎవరు నిర్దేశించిన ప్రాంతాల నుంచి కదిలి వెళ్ళకూడదని ఇప్పటికే డైరెక్షన్ ఇచ్చారు. కొన్ని పార్టీలకు చెందిన పోటీ చేసిన అభ్య ర్థులు కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళకుండానే తమ నివాసాల్లోఉండి కౌంటింగ్ పర్యవేక్షిస్తున్నారు. దీన్ని దృష్ట్యా ఏజెంట్లు అందరికి ముందు జాగ్రత్తలు నూరిపోశారు. ఇదిలా ఉండగా ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్ల లెక్కింపు అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ సమాంతరంగా సాగనుంది. ప్రతి రౌండ్లోనూ ఎంపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కకట్టి అనౌన్స్ చేస్తారు. ఈ సమయంలోను ఏజెంట్లు ఎక్కడికక్కడ అంకెలను సరిపోల్చుకోవాలని కూడా ఆయా పార్టీలు మార్గనిర్దేశం చేశాయి.
ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ చర్యలు : కలెక్టర్
ఏలూరుసిటీ, మే 25 : ఎన్నికల కమిషన్ మార్గరద్శకాలకు అనుగుణంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఆదేశించారు. వట్లూరులోని సర్ సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్లను, కౌంటింగ్ కేంద్రాలను, భద్రతా చర్యలను శనివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లన్నీ ముందస్తుగానే పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు వెళ్ళేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉంగుటూరు ఆర్వో ఖాజావలి, ఏలూరు ఆర్వో ముక్కంటి సర్వే అసిస్టెంట్ డైరక్టర్ బి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.