వారధిపై పగుళ్లు
ABN , Publish Date - Jul 29 , 2024 | 12:36 AM
పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలను అనుసంధానిస్తూ చించినాడ – దిండి గ్రామాల మధ్య వశిష్ఠ వారధిపై పగుళ్లు వాహనదారులను భయపెడుతున్నాయి.
చించినాడ బ్రిడ్జిపై గోతులు
పైకిలేచిన ఇనుప చువ్వలు
యలమంచిలి, జూలై 28: పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలను అనుసంధానిస్తూ చించినాడ – దిండి గ్రామాల మధ్య వశిష్ఠ వారధిపై పగుళ్లు వాహనదారులను భయపెడుతున్నాయి. నిర్వహణలో నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి కావడంతో బ్రిడ్జిపై నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బ్రిడ్జిపై పలుచోట్ల పెద్ద ఎత్తున గోతులు ఏర్పడ్డాయి. గోతుల్లో ఇనుప చువ్వలు పైకితేలి ప్రమాదకరంగా ఉన్నాయి. రహదారిపై ఎక్కడ చూసినా కాంక్రీటు పగుళ్లతో అడుగుకో గొయ్యి దర్శనమిస్తోంది. వాహనదారులు రాకపోకలకు ఇక్కట్లు పడుతున్నారు. రాత్రి సమయాల్లోనూ, వర్షం పడినపుడు నీరు గోతుల్లో చేరి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఫుట్పాత్ను అనుకుని చెత్త, మట్టి పేరుకుపోయి వర్షం వస్తే బ్రిడ్జిపై మడుగును తలపిస్తోంది. సుమారు పది రోజుల క్రితం కొన్ని గుంతలను పూడ్చినా కొద్దిరోజులకే కంకరరాళ్లు లేచాయి. బ్రిడ్జిపై సోలార్ విద్యుత్ దీపాలు వెలగడం లేదు.