Share News

వైద్యం వికటించి బాలుడి మృతి

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:47 AM

వైద్యం వికటించి ఓ చిన్నారి మృతి చెందడంతో నూజివీడు పట్టణంలో ఉద్రిక్తత ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి.

వైద్యం వికటించి బాలుడి మృతి
బాలుడి మృతదేహంతో ఆందోళన చేస్తున్న బంధువులు

నూజివీడు టౌన్‌, జనవరి 31: వైద్యం వికటించి ఓ చిన్నారి మృతి చెందడంతో నూజివీడు పట్టణంలో ఉద్రిక్తత ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి. నూజివీడు పట్టణం ఆర్‌ఆర్‌ పేటకు చెందిన వేముల రంగబాబు కుమారుడు యశ్వంత్‌ శ్రీరామ్‌ (11) మూడురోజుల క్రితం కాలికి గాయమవడంతో నూజివీడు తుమ్మలవారివీధిలో గల ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు మందులు ఇచ్చి పంపారు. అయితే బుధవారం ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో శ్రీరామ్‌ను బుధవారం ఉదయం ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షలు చేసిన వైద్యులు ఇన్‌ఫెక్షన్‌ ఉందని చిన్నారికి ఇంజక్షన్‌ ఇచ్చారు. ఇంటికి తీసుకువెళ్ళేసరికి బాలుడి శరీరం మొత్తం నీలం రంగులోకి మారింది. దీంతో తిరిగి బాలుడిని వైద్యం చేసిన ప్రైవేట్‌ ఆసుపత్రికి తల్లిదం డ్రులు తీసుకువచ్చారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో తక్షణం విజయవాడకు తీసుకువెళ్ళాలని ప్రైవేట్‌ ఆసుపత్రి వైద్యులు పేర్కొంటూ మరో రెండు ఇంజక్షన్‌లు ఇచ్చి పంపారని, ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి కొద్ది దూరం వెళ్లేసరికే బాలుడి పరిస్థితి మరింత దిగ జారడంతో స్థానికంగా ఉన్న అమెరికన్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పూర్తిస్థాయి వైద్యసేవలు అందించేలోపే శ్రీరామ్‌ మృతి చెందాడని, ప్రైవేట్‌ ఆసుపత్రి వైద్యం వికటించడం వల్లే మృతిచెందాడంటూ బాలుడి బంధువులు, ఆర్‌ఆర్‌పేట వాసులు ఆసుపత్రి వద్ద బాలుడి మృతదేహంతో ఆందోళనకు దిగారు. దీంతో నూజివీడు పట్టణ సీఐ మూర్తి సంఘటనా స్థలికి చేరుకుని దోషులపై చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Updated Date - Feb 01 , 2024 | 12:47 AM