ఆటో డ్రైవర్ అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Jan 14 , 2024 | 12:37 AM
ఒక ఇంటి కాపలాకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో వాటర్ ట్యూబ్ మెడకు చుట్టి ఉరి వేయబడి మృతి చెందడంతో మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
![ఆటో డ్రైవర్ అనుమానాస్పద మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
ఏలూరు క్రైం, జనవరి 13 : ఒక ఇంటి కాపలాకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో వాటర్ ట్యూబ్ మెడకు చుట్టి ఉరి వేయబడి మృతి చెందడంతో మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు రూరల్ మండలం చొదిమళ్ళకు చెందిన యడ్ల శ్రీనివాసరావు (42)కు భార్య రజని, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆటో డ్రైవర్గా వృత్తిని కొనసాగిస్తూ మరోవైపు కూలి పనులకు కూడా వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఆ గ్రామానికి చెందిన రైతు వంశీ తన కుటుంబంతో విశాఖపట్టణం వెళ్తూ ఆ ఇంటికి కాపలాగా యడ్ల శ్రీనివాసరావు, అతని బంధువుకు అప్పగించి వెళ్ళారు. శ్రీనివాసరావు ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతలో ఇంటి నుంచి రైతు వంశీ ఇంటికి కాపలాకి వెళ్ళాడు. ఉదయమైనా ఇంటికి రాకపోవడంతో అతడి భార్య రజని ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆయన కుమార్తె వర్షిక రైతు ఇంటికి వెళ్లి చూడగా తండ్రి మెడకు వాటర్ ట్యూబ్ చుట్టబడి ఉరి వేసినట్టుగా ఉంది. ఆమె తన తల్లికి చెప్పి, ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ కె.రాజారెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పంచనామా నిర్వహించి శనివారం సాయంత్రం పోస్టు మార్టం నిర్వహించారు. ఈలోపు ఆసుపత్రి ఎదుట శ్రీనివాసరావు మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆ దిశగా ఆందోళనకు దిగారు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, తమ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని ఒక వ్యక్తిపైన ఫిర్యాదు చేయ డంతో తిరిగి శనివారం రాత్రి పంచనామా వాంగ్మూలాలను నమోదు చేశారు. ఏలూరు రూరల్ ఎస్ఐ కె.రాజారెడ్డి ఈ ఘటనపై అనుమా నాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.