గెలుపే లక్ష్యంగా పనిచేయండి
ABN , Publish Date - Feb 27 , 2024 | 11:39 PM
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన గెలుపే లక్ష్యంగా అందరూ కష్టపడి పని చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.
- నారా భువనేశ్వరి
- ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
గజపతినగరం/బొండపల్లి, ఫిబ్రవరి 27: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన గెలుపే లక్ష్యంగా అందరూ కష్టపడి పని చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. మంగళవారం సాలూరులో సంజీవని మెడికల్ క్లినిక్ను ప్రారంభోత్సవానికి వెళ్తున్న ఆమెకు స్థానిక చంపావతి వంతెన వద్ద జాతీయ రహదారిపై గజపతినగరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్, పలువురు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. శ్రీనివాస్ తనకు తాను పరిచయం చేసుకున్నారు. అనంతరం మండల సముదాయం సమీపంలోని ఉన్న ఒక లేఅవుట్లో భువనేశ్వరి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాభీష్టం మేరకు గజపతినగరం టీడీపీ అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ను అధిష్ఠానం ప్రకటించిందని, ఆయన గెలుపునకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, అందరికీ మంచి జరుగుతుందని తెలిపారు. దీంతో మహిళలు ఆనందంతో జై తెలుగుదేశం.. జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో గంట్యాడ, గజపతినగరం మాజీ ఎంపీపీలు కొండపల్లి కొండలరావు, గంట్యాడ శ్రీదేవి, సీనియర్ నాయకులు చప్ప చంద్రశేఖర్, బొడ్డు రాము, తదితరులు పాల్గొన్నారు.