కుక్కల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:42 AM
మండలంలోని పెదమేరంగి కూడలి సమీపంలో పెట్రోల్ బంకు వద్ద గంట లక్ష్మి అనే మహిళపై కుక్కలు దాడి చేశాయి.
జియ్యమ్మవలస: మండలంలోని పెదమేరంగి కూడలి సమీపంలో పెట్రోల్ బంకు వద్ద గంట లక్ష్మి అనే మహిళపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆమె తీవ్ర గాయాలపాలయ్యింది. ట్రాక్టర్ మెకానిక్ అయిన గంట రవీంద్ర తన భార్యతో కలిసి పెదమేరంగి కూడలి వద్ద తమ ఇంటికి సమీపంలో మెకానిక్ షాపు నడుపుకుని జీవిస్తున్నారు. ఉదయాన్నే షాపు తలుపులు తీయగానే ఒక్కసారి 17 కుక్కలు ఆమెపై దాడి చేశాయి. ఆమె కేకలు వేయడంతో అక్కడే ఇంట్లో ఉన్న భర్త వచ్చి వాటిని తరమగా అవి విడిచిపెట్టి వెళ్లిపోయాయి. లేదంటే ఖచ్చితంగా ఆమె మృతి చెందేది అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈమెకు మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఉన్న సౌజన్య హాస్పిటల్కు హుటాహుటిన తీసుకెళ్లారు. అక్కడ ఆమె పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, కుక్కల ఏరివేత కార్యక్రమం చేయాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.