Share News

నిధులు లేక.. పనులు సాగక!

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:08 AM

ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రహదారులు ఎంతో కీలకం. అయితే వాటి నిర్మాణం విషయం దేవుడెరుగు.. ఐదేళ్ల కాలంలో రోడ్ల మరమ్మతులపై కూడా వైసీపీ సర్కారు పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎంత అధ్వానంగా మారాయో.. అడుగుకో గొయ్యితో ఎంత ప్రమాదకరంగా మారాయో.. వేరేగా చెప్పనవసరం లేదు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో కొత్తగా మంజూరైన రహదారుల నిర్మాణాలనూ సర్కారు పూర్తిగా పట్టించుకోవడం మానేసింది.

నిధులు లేక.. పనులు సాగక!
కురుపాం నియోజకవర్గంలో మధ్యలో నిలిచిపోయిన తోటపల్లి - గుణుపురం రోడ్డు

ఐదున్నర నెలలే గడువు..

రూ. 47.81 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌

ఇబ్బందుల్లో ప్రజలు

( జియ్యమ్మవలస )

ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రహదారులు ఎంతో కీలకం. అయితే వాటి నిర్మాణం విషయం దేవుడెరుగు.. ఐదేళ్ల కాలంలో రోడ్ల మరమ్మతులపై కూడా వైసీపీ సర్కారు పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎంత అధ్వానంగా మారాయో.. అడుగుకో గొయ్యితో ఎంత ప్రమాదకరంగా మారాయో.. వేరేగా చెప్పనవసరం లేదు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో కొత్తగా మంజూరైన రహదారుల నిర్మాణాలనూ సర్కారు పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆ నిర్మాణాలన్నీ నిలిచిపోయాయి. మొత్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి జిల్లావాసులకు అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఎప్పటికి బిల్లులు మంజూరవుతాయి.. ఇంకెప్పటికీ ఈ రోడ్ల నిర్మాణాలు పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిర్మాణాల పూర్తికి ఐదున్నర నెలల గడువు ఉన్నందున.. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి

ఉమ్మడి జిల్లాలో 2021, మార్చి 28న ఏడు స్టేట్‌ హైవే రోడ్లు మంజూరయ్యాయి. వీటిని నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన ఎం/ఎస్‌ బీవీఎస్‌ఆర్‌ కనస్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ. 139.43 కోట్ల అగ్రిమెంట్‌తో ముందుకు వచ్చింది. ఏకకాలంలో నిర్మాణాలు ప్రారంభించింది. అయితే కొన్ని చోట్ల పనులు దాదాపు పూర్తవ్వగా, మరికొన్ని చోట్ల మధ్యలో నిలిచి పోయాయి. వాస్తవానికి ఈ రహదారుల నిర్మాణాలు 2023, మార్చి 27 నాటికి పూర్తికావాల్సి ఉంది. కానీ చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు కాకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. కాంట్రాక్టర్‌ ఈ విషయాన్ని అధికారులకు తెలియ జేయడంతో రోడ్డు నిర్మాణాల గడువును 2024, సెప్టెంబరు 17 వరకు పొడిగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇంతవరకు రూ. 55.34 కోట్ల విలువైన పనులు జరిగితే, ఇందులో రూ. 47.81 కోట్ల మేర బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉండి పోయాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆయా రోడ్ల పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా గడువు నాటికి రహదారుల నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం కన్పించడం లేదు.

విజయనగరం డివిజన్‌లో...

విజయనగరం డివిజన్‌లో 42 కిలో మీటర్ల మేర నాలుగు రోడ్ల నిర్మాణానికి రూ. 105.04 కోట్లతో పరిపాలనా ఆమోదం లభించింది. ఆ తరువాత రూ. 96.71 కోట్లతో సాంకేతిక అనుమతి లభించింది. ఈ మేరకు రూ. 26.82 కోట్ల విలువైన పనులు జరిగినప్పటికీ.. రూ. 22.90 కోట్ల మేర బిల్లులు చెల్లింపులు జరగలేదు. దీంతో కాంట్రాక్టరు చేతులెత్తేశారు. మొత్తంగా ఆయా రోడ్ల పనులు ఎంతవరకు వచ్చాయంటే..

- గజపతినగరం - జిన్నాం - గడసాం - పొరలి రోడ్డు స్టేట్‌ హైవే-124 పరిధిలో ఉంది. మొత్తం 17.623 కిలో మీటర్ల ఈ రోడ్డు నిర్మాణానికి రూ. 45.16 కోట్లు మంజూరు చేశారు. అయితే రూ. 8.97 కోట్ల మేర పనులు మాత్రమే జరిగాయి. రూ. 6.51 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

- చింతపల్లి - విజయనగరం రోడ్డు స్టేట్‌ హైవే-147 పరిధిలో ఉంది. 3.92 కిలో మీటర్ల ఈ రోడ్డు నిర్మాణానికి రూ. 8.70 కోట్లు మంజూరయ్యాయి. కానీ ఇక్కడ రూ. 45 లక్షలు విలువైన పనులు మాత్రమే జరగ్గా.. రూ. 36 లక్షల మేర బిల్లు పెండింగ్‌లో ఉంది.

- స్టేట్‌ హైవే-134 పరిధిలో 4.19 కిలో మీటర్ల మేర విజయనగరం - భీమసింగి - కొత్తవలస రోడ్డు నిర్మాణానికి రూ. 7.48 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ. 4.15 కోట్లు పనులు జరగ్గా ఇంకా రూ. 3.17 కోట్ల మేర బిల్లు పెండింగ్‌లో ఉంది.

- స్టేట్‌ హైవే-140 పరిధిలో 16.587 కిలో మీటర్ల మేర సోంపురం - ఆనందపురం రోడ్డు నిర్మాణానికి రూ. 35.37 కోట్లు మంజూరయ్యాయి. అయితే రూ. 13.25 కోట్ల విలువైన పనులు జరగ్గా రూ. 12.86 కోట్ల మేర బిల్లు పెండింగ్‌లో ఉంది.

పార్వతీపురం డివిజన్‌లో...

పార్వతీపురం డివిజన్‌లో 48.44 కిలో మీటర్ల మేర మూడు ప్రధాన రోడ్లు నిర్మాణాలకు రూ. 134.84 కోట్లతో పరిపాలనా ఆమోదం లభించింది. ఇందులో రూ. 125.18 కోట్లకు సాంకేతిక అనుమతులు లభించాయి. అయితే ఈ మూడేళ్లలో రూ. 28.52 కోట్ల విలువైన పనులు జరిగాయి. కాగా అందులో రూ. 24.91 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కాంట్రాక్టరు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ మూడు రోడ్ల పరిస్థితి ఒక్కసారి పరిశీలిస్తే..

- కురుపాం నియోజకవర్గం పరిధిలో తోటపల్లి - గుణుపురం రోడ్డు స్టేట్‌ హైవే-081 పరిధిలో ఉంది. ఈ రోడ్డులో 14 కిలో మీటర్ల పనులకు గాను రూ. 35.37 కోట్లు మంజూరయ్యాయి. రూ. 19.17 కోట్లు విలువ గల పనులు జరిగితే రూ. 16.50 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

- సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలో మక్కువ - అజ్జాడ రోడ్డు స్టేట్‌ హైవే-003 పరిధిలో ఉంది. ఈ రోడ్డులో 15.480 కిలో మీటర్ల పనులకు రూ. 38.40 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు రూ. 4.53 కోట్ల మేర పనులు జరిగ్గా, రూ. 3.95 కోట్ల మేర బిల్లు పెండింగ్‌లో ఉంది.

- సాలూరు నియోజకవర్గం పరిధిలో సాలూరు - దుగ్గేరు వయా మక్కువ రోడ్డు స్టేట్‌ హైవే-100 పరిధిలో ఉంది. 19.15 కిలో మీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణానికి రూ. 55.56 కోట్లు మంజూరయ్యాయి. అయితే రూ. 4.82 కోట్ల మేర పనులు జరిగితే రూ. 4.46 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

మంజూరుకు పంపించాం

ఉమ్మడి జిల్లాలో మంజూరైన ఏడు ప్రధాన రహదారుల నిర్మాణాలు కొంత వరకు జరిగాయి. అయితే రూ. 47.81 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సిన మాట వాస్తవమే. ఇది సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉంది. బిల్లుల మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదించాం.

- జీవీ రమణ, ఆర్‌అండ్‌బీ ఈఈ, విజయనగరం డివిజన్‌

Updated Date - Mar 28 , 2024 | 12:08 AM