అనుమానంతోనే...
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:02 AM
మండలంలో చింతలబెలగాం పంచాయతీ సింగనాపురం గ్రామంలో ఈ నెల 22న భార్యను హతమార్చిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను బుధవారం సాయంత్రం చినమేరంగి పోలీస్స్టేషన్లో డీఎస్పీ జీవీ కృష్ణారావు వెల్లడించారు.
వివరాలు వెల్లడించిన డీఎస్పీ కృష్ణారావు
జియ్యమ్మవలస, మార్చి 27 : మండలంలో చింతలబెలగాం పంచాయతీ సింగనాపురం గ్రామంలో ఈ నెల 22న భార్యను హతమార్చిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను బుధవారం సాయంత్రం చినమేరంగి పోలీస్స్టేషన్లో డీఎస్పీ జీవీ కృష్ణారావు వెల్లడించారు. తాగుడుకు బానిసైన ముసలినాయుడు అనుమానంతోనే భార్య గంటా అప్పలనర్సమ్మ (60)ను హతమార్చాడని ఆయన తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అప్పలనర్సమ్మను హత్య చేసిన అనంతరం కొండచిలకాం పంచాయతీ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలోకి నిందితుడు పారిపోయాడని తెలిపారు. చినమేరంగి సీఐ బి.మంగరాజు, చినమేరంగి ఎస్ఐ ఇ.చిన్నంనాయుడు, జియ్యమ్మవలస ఎస్ఐ పి.అనీష్, పోలీస్ సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారన్నారు. చివరకు తాళ్లడుమ్మ పంచాయతీ లక్ష్మిపేట వద్ద నిందితుడిని పట్టుకున్నారని వెల్లడించారు. ముసలినాయుడుపై 302 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి పార్వతీపురం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని చెప్పారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీఐ, ఎస్ఐను ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ సీసీ రాజారావు, హెచ్సీ సోములు, కానిస్టేబుళ్లు రాజేష్, సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.