వాటి సంతతి పెరిగేనా?
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:54 PM
ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, గుర్రాలు, పందులు, పెంపుడు కుక్కలు, ఏనుగులు, కోళ్లు ఇలా 16 రకాల పశు సంపద పరిస్థితి ఏంటి.. పెరుగుతున్నాయా.. తగ్గాయా.. కారణాలేంటి అనేది తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం పశుగణన చేయిస్తుంది. జిల్లా విషయానికొస్తే ఇవన్నీ తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పాడి పశువులు, దుక్కిటెద్దులు, దున్నల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గొర్రెలు, మేకలు, ఇతరత్రా సంఖ్య మరీ దారుణం. ఈ పరిస్థితిలో చేపడుతున్న పశుగణన ఏమేర ఉపయోగం ఉంటుందో చూడాలి. పశు సంవర్థక సిబ్బంది 2025 ఫిబ్రవరి 28 వరకు గణించే విధుల్లో నిమగ్నం కానున్నారు.

వాటి సంతతి పెరిగేనా?
పశుగణనను ప్రారంభించిన ప్రభుత్వం
16 రకాల మూగజీవుల పెంపుపై దృష్టి
జిల్లాలో పాడి పశువులు తగ్గుముఖం
ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, గుర్రాలు, పందులు, పెంపుడు కుక్కలు, ఏనుగులు, కోళ్లు ఇలా 16 రకాల పశు సంపద పరిస్థితి ఏంటి.. పెరుగుతున్నాయా.. తగ్గాయా.. కారణాలేంటి అనేది తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం పశుగణన చేయిస్తుంది. జిల్లా విషయానికొస్తే ఇవన్నీ తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పాడి పశువులు, దుక్కిటెద్దులు, దున్నల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గొర్రెలు, మేకలు, ఇతరత్రా సంఖ్య మరీ దారుణం. ఈ పరిస్థితిలో చేపడుతున్న పశుగణన ఏమేర ఉపయోగం ఉంటుందో చూడాలి. పశు సంవర్థక సిబ్బంది 2025 ఫిబ్రవరి 28 వరకు గణించే విధుల్లో నిమగ్నం కానున్నారు.
విజయనగరం రూరల్/ రింగురోడ్డు/ రాజాం, అక్టోబరు 25:
పశు గణన ప్రక్రియ చాలా కీలకం. మూగజీవుల మనుగడపై ఓ అంచనాకు వస్తేనే వృద్ధి చేసుకునే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టగలవు. తొలుత ఈ పశుగణన ఈ ఏడాది సెప్టెంబరు 1న ప్రారంభం కావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి జరగనున్న ఈ ప్రక్రియకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సిద్ధమైనా కొన్ని రాష్ట్రాలు సిద్ధం కాకపోవడంతో తాత్కాలికంగా పశుగణనను వాయిదా వేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో జిల్లాలో ఈ ప్రక్రియ 25న మొదలైంది. 2025 ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పశువంర్థకశాఖ పశుగణనకు సిద్ధమైంది. 2019లో పశుగణన జరగ్గా తిరిగి ఇప్పుడు ప్రారంభమైంది. ఐదేళ్లకు ఒకసారి పశుగణన చేపట్టనున్నారు. పశు సంవర్థకశాఖ సిబ్బందికి పశు గణనపై ఇప్పటికే శిక్షణ పూర్తయ్యింది. ఈ ప్రక్రియ కోసం జిల్లాస్థాయిలో నోడల్ అధికారిగా పశు సంవర్థకశాఖకు సంబంధించిన డాక్టరు పూడి లోకేష్ నియమితులు కాగా వీరితో పాటు క్షేత్రస్థాయిలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లను ఏర్పాటు చేశారు. పశు సంవర్థకశాఖ జేడీ రమణ ఇప్పటికే ఈ గణనకు సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బందిని సమాయత్తం చేశారు. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో ఒక యాప్ను రూపొందించారు. ఈ యాప్ జిల్లాస్థాయిలో కూడా వినియోగిస్తున్నారు. గతంతో పోల్చితే ఈ ఏడాది జరుగుతున్న పశు గణనను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్నారు. వారి, వారి సెల్, ట్యాబ్ల ద్వారా చేస్తారు. 68 మంది సూపర్వైజర్లు, 225 మంది ఎన్యుమరేటర్లు ఈ విధుల్లో ఉంటారు.
2019లో పశుగణన వివరాలు
1. ఆవులు 3,77,960
2. గేదెలు 97,845
3.గొర్రెలు 4,48,154
4.మేకలు 1,56, 511
5.పందులు 2,585
6.కోళ్లు 51,26,764
పక్కాగా చేపడతాం
పశువుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే పశుగణన పక్కాగా చేపడతాం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. రైతులంతా సమగ్ర వివరాలను అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
- వైవీ రమణ, పశుసంవర్థక శాఖ జేడీ, విజయనగరం
ఎన్యూమరేటర్లకు పూర్తి సమాచారం ఇవ్వండి
విజయనగరం కలెక్టరేట్/ విజయనగరం రూరల్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా అఖిలభారత 21వ పశుగణన శుక్రవారం నుంచి ప్రారంభమైందని, సమాచారం కోసం ప్రజల వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లకు సహకారం అందించాలని కలెక్టర్ అంబేడ్కర్ కోరారు. పశుగణన వాల్పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. సరైన సమాచారం ఇవ్వాలన్నారు. పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి వైవీ రమణ మాట్లాడుతూ రైతులు తమ ఇంటివద్దకు వచ్చే ఎన్యూమరేటర్లకు పశువుల సమగ్ర సమాచారాన్ని అందించాలని కోరారు. ఎమ్మెల్యే అదితిగజపతిరాజు కూడా శుక్రవారం జిల్లా కేంద్రంలో పోస్టర్ను ఆవిష్కరించారు.
------------------------