ఎందుకున్నట్టు?
ABN , Publish Date - Apr 17 , 2024 | 12:16 AM
బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఏ లక్ష్యం కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేశారో? ఆ లక్ష్యసాధనకు ఈ ప్రభుత్వం తూట్లు పొడిచింది. కేవలం రాజకీయ ఉపాధినే కల్పించారు.
![ఎందుకున్నట్టు?](https://media.andhrajyothy.com/media/2024/20240413/MAINCARTOON_1406_b032d13121.gif)
ఎందుకున్నట్టు?
ఉపయోగం లేని కార్పొరేషన్లు
కోకొల్లలుగా చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కానరాని రుణాలు
వలసపోతున్న నిరుద్యోగులు
విజయనగరం(ఆంధ్రజ్యోతి)
బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఏ లక్ష్యం కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేశారో? ఆ లక్ష్యసాధనకు ఈ ప్రభుత్వం తూట్లు పొడిచింది. కేవలం రాజకీయ ఉపాధినే కల్పించారు. నిధులు, అధికారాలను నామమాత్రం చేశారు. ఆయా కార్పొరేషన్లకు డైరెక్టర్లను ఏర్పాటు చేశారు. కూర్చునేందుకు కుర్చీలు లేవు. చైర్మన్లకు, డైరెక్టర్లకు ప్రతి నెలా గౌరవ వేతనాలు తీసుకోవడం తప్పితే వారికి కనీస పని కూడా లేకుండా పోయింది. విద్య, ఉపాధి వంటి కార్యక్రమాలు చేపట్టినా బాగుండేది.
జిల్లాలో దాదాపుగా 25 లక్షల జనాభా వున్నారు. వీరిలో 50 శాతం బీసీలే. ఎస్సీల జనాభా 15 నుంచి 18 శాతం, ఎస్టీ జనాభా 2 శాతం, ముస్లిం 2 శాతం, క్రిస్టియన్లు 2 శాతం వున్నారు. గత ప్రభుత్వాల పాలనలో కార్పొరేషన్ల నుంచి ఆయా తరగతుల ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి రుణాలు సబ్సిడీపై అందేవి. ఉదాహరణకు రూ.6 లక్షలు ఇస్తే, రూ. 3 లక్షలు మాత్రమే కట్టాల్సి వుండేది. ఇలా వారి ఉపాధి కోసం సబ్సిడీ దోహదపడేది. రుణం తీసుకున్న అభ్యర్థులు ఖచ్చితంగా ఉపాధి చూసుకునేవారు. తీసుకున్న రుణాలతో వ్యాపారాన్ని ప్రారంభించి ఆత్మవిశ్వాసంతో జీవించేవారు. కిరాణా దుకాణాలు, పాడిపరిశ్రమ, అల్పాహారం, టీ కొట్లు ఇలా వివిధ రకాల రుణాలతో ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందేవి.
- గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.20 లక్షలు విలువ చేసే ఇన్నోవా కారు సైతం కార్పొరేషన్ ద్వారా సబ్సిడీకి అందించి నిరుద్యోగులు ఉపాధి పొందేలా చూసింది. కార్పొరేషన్ల రుణ వితరణలో ప్రత్యేక విభాగం నిరంతరం పనిచేసేది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వీటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 50కి పైగా కార్పొరేషన్లను కొత్తగా తీసుకొచ్చింది. హడావిడిగా వాటికి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి వదిలేసింది. జిల్లాలో వెనుకబడిన సామాజిక తరగతుల ప్రజలకు స్వయం ఉపాధి అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయని చెప్పాలి. సంక్షేమ పథకాలకు ఇచ్చే సొమ్మును కార్పొరేషన్ రుణాలుగా ఇచ్చి ఉంటే స్థిరమైన ఉపాధి పెరిగేదన్న అభిప్రాయం చాలా మంది నుంచి వినిపిస్తోంది. ఈ ప్రభుత్వంలో జిల్లాలోని వందలాది మంది యువత, కన్నవారిని, ఉన్న ఊరిని విడిచి ఉపాధి కోసం జిల్లాలు, రాష్ట్రాలు దాటి వెళ్లిపోతున్నారు.