గురువారం గ్రామ సందర్శన
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:23 PM
గ్రామ, వార్డు స్థాయిలో ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో జిల్లాలో వచ్చే గురువారం నుంచి గ్రామ, వార్డు సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చేపడుతున్నట్లు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పారు.
గురువారం గ్రామ సందర్శన
సమస్యల పరిష్కారమే లక్ష్యం
పట్టణాల్లోనూ వార్డు సందర్శన
కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్
కలెక్టరేట్, జూలై 15: గ్రామ, వార్డు స్థాయిలో ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో జిల్లాలో వచ్చే గురువారం నుంచి గ్రామ, వార్డు సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చేపడుతున్నట్లు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. మండల నోడల్ అధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్, ఎంపీడీవో, ఇతర అధికారులతో కూడిన బృందం ప్రతి గురువారం మండలంలోని ఒక గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలో ప్రజా సమస్యలను తెలుసుకుని అవకాశం ఉంటే అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ, వార్డుల సందర్శనకు వెళ్లే అధికారులు అక్కడి ప్రభుత్వ సంస్థలను సందర్శించి, వాటి పనితీరును, వాటి ద్వారా ప్రజలకు అందు తున్న సేవలను సమీక్షించాలన్నారు. గ్రామంలో పారిశుధ్యం మెరుగుపరచడం, తాగునీటి సరఫరా, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని వాటిని మెరుగుపరిచే దిశగా గ్రామ సందర్శనలో చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలు సందర్శించి అక్కడి మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, మెనూ అమలు, విద్యార్థుల విషయ పరిజ్ఞానం పరిశీలన, స్కూల్ కిట్ల పంపిణీపై ఆరా తీయడం వంటివి చేయాలన్నారు. ఆసుపత్రుల్లో మందుల లభ్యత, ప్రసవాలు, ఓపి, వర్షాకాలంలో వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి కూడా తెలుసుకోవాలన్నారు.
- ఇందుకోసం ప్రతి మండలానికీ ఒక నోడల్ అధికారిని నియమించామని తెలిపారు. నోడల్ అధికారులు గురువారం నుంచి తమకు కేటాయించిన మండలాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. నోడల్ అధికారులు, మండల అధికారుల బృందం ప్రతి నెలలో ఒక గురువారం తమ మండల పరిధిలోని ఒక సంక్షేమ హాస్టల్లో బస చేయాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించే అంశంపై ప్రజల్లో అవగాహన కల్గించాలని చెప్పారు. సమావేశంలో జేసీ కార్తీక్; ఇన్చార్జీ డీఆర్వో సుమబాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.