వసంత నవరాత్రికి సిద్ధమవుతున్న ‘తోటపల్లి’
ABN , Publish Date - Apr 08 , 2024 | 12:22 AM
ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి శ్రీవేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాలు వసంత నవరాత్రి మహోత్సవాలకు సిద్ధమవుతున్నాయి.
![వసంత నవరాత్రికి సిద్ధమవుతున్న ‘తోటపల్లి’](https://media.andhrajyothy.com/media/2024/20240407/7ppmp7_d6a64136f0.gif)
గరుగుబిల్లి, ఏప్రిల్ 7: ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి శ్రీవేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాలు వసంత నవరాత్రి మహోత్సవాలకు సిద్ధమవుతున్నాయి. కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో ఈనెల 9 నుంచి 17వ తేదీ వరకు నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం శ్రీరామ సుప్రభాత సేవ, ఆరాధన, మంగళా శాసనం, అంకురారోహణం, జప హోమ తర్పణం, పుష్పాంజలి శ్రీరామ, లక్ష్మి మంత్ర జపాలతో పలు పూజలు నిర్వహిస్తామని చెప్పారు. ఈనెల 17న 9 గంటలకు శ్రీసీతారామస్వామి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. స్వామివారి కల్యాణంలో పాల్గొనే భక్తులు రూ.500 చెల్లించి రశీదు పొందాలన్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొవాలని కోరారు. కల్యాణానికి సంబంధించి అవసరమైన సామగ్రిని పలువురు దాతలు అందిస్తున్నారని తెలిపారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు.
రేపు ఉగాది పంచాంగ శ్రవణం
తోటపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో మంగళవారం ఉగాదిని పురస్కరించుకుని పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్లు ఈవో వీవీ సూర్యనారాయణ తెలిపారు. క్రోధి నామ సంవత్సర విశిష్టత, పంచంగ పఠన కార్యక్రమం టీటీడీ ఆధ్యాత్మిక ఉపన్యాసకుడు, తెలుగు పండితుడు పొందూరు సుధాకుమార్శర్మతో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉగాది రోజున స్వామివారిని దర్శించుకుని పంచాంగ శ్రవణానికి భక్తులు తరలిరావాలని ఈవో కోరారు.