కొండను ఢీకొన్న పెళ్లి వ్యాన్
ABN , Publish Date - May 22 , 2024 | 11:13 PM
ఓ యువకుడి పెళ్లిని నిశ్చయించేందుకు బంధువులతో వెళ్తున్న వ్యాన్ కొండను ఢీకొట్టింది.
![కొండను ఢీకొన్న పెళ్లి వ్యాన్](https://media.andhrajyothy.com/media/2024/20240511/22_MAY_SALUR_RURAL_29_e9a9d047d9.gif)
- 25 మందికి గాయాలు
సాలూరు రూరల్, మే 22: ఓ యువకుడి పెళ్లిని నిశ్చయించేందుకు బంధువులతో వెళ్తున్న వ్యాన్ కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది గాయపడిన ఘటన బుధవారం ఏవోబీలో కొడంగివలస వద్ద జరిగింది. సాలూరు మండలం జగ్గుదొరవలసకు చెందిన అనిల్కుమార్ ఏవోబీలోని గిరిశిఖర గ్రామం చోర గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇరువురికి వివాహం చేయడానికి పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా గిరిజన సంప్రదాయం ప్రకారం యువతి కుటుంబీలకు యువకుడి కుటుంబీకులు తప్పు (అపరాధ రుసుం) చెల్లించాల్సి ఉంటుంది. బుధవారం తప్పు చెల్లించి, వివాహ నిశ్చయించేందుకు గాను అనిల్కుమార్ కుటుంబీకులు, బంధువులు 30 మంది పికప్ వ్యాన్లో చోర బయలుదేరారు. వాహనం కొడంగివలస వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి దిగువ (డౌన్)కు జారి రోడ్డు పక్కనే ఉన్న కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్లో ఉన్న 25 మందికి గాయాలయ్యాయి. వీరిలో 18 మందికి మక్కువ పీహెచ్సీలో చికిత్స అందించారు. మరో ముగ్గురిని సాలూరు ఏరియా ఆసుపత్రికి, నలుగురిని పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ఈ ఘటనపై సాలూరు రూరల్ ఎస్ఐ ఎం.వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇదే ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి 27న మక్కువ మండలం విజయరాంపురానికి చెందిన వారు పెళ్లి నిశ్చయం చేసుకొని కొదమకు తిరిగి వస్తుండగా వ్యాన్ బోల్తా పడింది. ఆ ఘటనలో 25 మంది గాయపడ్డారు. అదే చోట అదే విధంగా బుధవారం పెళ్లి నిశ్చయానికి వెళ్తున్న బృందానికి ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.