తీరం.. కలుషితం
ABN , Publish Date - May 24 , 2024 | 11:53 PM
తీరంలో ఉండే రొయ్యల హేచరీస్ నిర్వాహకులు వ్యర్థాలతో కూడిన నీటిని నిర్లక్ష్యంగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. తద్వారా తీరంలో ఆహ్లాదానికి సముద్రంలో మత్స్య సంపదకు అపాయం తీసుకొస్తున్నారు. నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, సముద్రంలోకి శుద్ధి చేసిన నీటినే వదలుతామని చెప్పి తొలుత అధికారుల నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. తర్వాత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నపాలు ఇస్తున్నారు.
![తీరం.. కలుషితం](https://media.andhrajyothy.com/media/2024/20240511/23bgp6_536857247c.gif)
తీరం.. కలుషితం
సముద్రంలోకి కాలుష్య జలాలు
మత్స్య సంపదకూ తీవ్రమైన నష్టం
ఆందోళన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు
భోగాపురం, మే 24: తీరంలో ఉండే రొయ్యల హేచరీస్ నిర్వాహకులు వ్యర్థాలతో కూడిన నీటిని నిర్లక్ష్యంగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. తద్వారా తీరంలో ఆహ్లాదానికి సముద్రంలో మత్స్య సంపదకు అపాయం తీసుకొస్తున్నారు. నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, సముద్రంలోకి శుద్ధి చేసిన నీటినే వదలుతామని చెప్పి తొలుత అధికారుల నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. తర్వాత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నపాలు ఇస్తున్నారు.
ముక్కాం, కొండ్రాజుపాలెం, చేపలకంచేరు తీరంలో రొయ్యల హేచరీస్ నడుస్తున్నాయి. రొయ్య పిల్లల ఉత్పత్తి కోసం అందులో ప్రత్యేకంగా ట్యాంకులు నిర్మించారు. వాటిలో అనేక మందులు కలిపి రొయ్య పిల్లలను ఉత్పత్తి చేస్తుంటారు. అనంతరం ఆ నీటిని పైపులైన్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఆ వ్యర్థ జలాలు చాలా ప్రమాదకరం. రొయ్యల ఉత్పత్తి తర్వాత ఆ నీటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేశాకే బయటకు పంపాలి. సముద్రం లోపలి వరకు పైప్లైన్ ఉండాలి. కానీ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నీటిని శుద్ధి చేయడం లేదు. నాణ్యత లేని పైపులను వాడుతున్నారు. అవి ఎక్కడికక్కడ లీకులు ఇస్తున్నాయి. తీరం సమీపంలో నీటిని వదిలేస్తున్నారు. దీనివల్ల బీచ్ అంతా పాడవుతోంది. ఆ ప్రాంతంలో తాబేళ్ల సంతతి కూడా వృద్ధి కాదని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఈ పరిస్థితిపై సంవత్సరాలుగా మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. హేచరీస్ నిర్వాహకులు మాత్రం కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అధికారులు పరిశీలించడం లేదు. దీనిపై మత్స్యశాఖ ఎఫ్డీవో చాందినిని వివరణ కోరగా హేచరీస్ నుంచిబయటకు వదిలే వృథా నీటిని ట్రీట్ చేసి సముద్రంలోకి పంపాలని, శుద్ధి చేయకుండా వదిలితే చర్యలు తీసుకుంటామని అన్నారు.