సమస్యలను పరిష్కరించండి
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:09 AM
ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛను దారులకు సంబంధించిన అనేక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహ సీల్దారు కార్యాలయం ఎదుట గురువారం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
![సమస్యలను పరిష్కరించండి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బొబ్బిలి: ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛను దారులకు సంబంధించిన అనేక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహ సీల్దారు కార్యాలయం ఎదుట గురువారం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర పెన్షనర్ల సంఘ నేత రౌతు రామూర్తితో పాటు ఏపీటీఎఫ్ నాయకులు జేసీ రాజు, బంకురు జోగి నాయుడు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందన్నారు. పింఛనుదారులకు మరీ అన్యాయం చేసిందన్నారు. పాత బకాయి లన్నిటినీ విడుదల చేయాలని, ఐఆర్ను 30 శాతం ప్రకటించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమ కార్యకర్తలపై కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఓటు ద్వారా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు సీహెచ్జే ప్రవీణ్ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ బొత్స పద్మావతి, నాగేశ్వరరావు, పీటర్, ఎల్లయ్య, లక్ష్మణరావు, శ్రీను, చిన్నారావు, మోహనరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో విఫలం
రాజాం: ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నా... తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీటీఎఫ్ జోనల్ కన్వీనర్, జిల్లా ఉపాధ్యక్షుడు మురపాక వెంకటరమణ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఆసక్తి కనబరచడం లేదన్నారు. 12వ పీఆర్సీలో మధ్యంతర భృతిని తక్షణమే చెల్లించాలని... 11వ పీఆర్సీ బకాయిలు ఒకేసారి చెల్లించాలని కోరారు. ఈ మేరకు డిప్యూటీ తహశీల్దార్ వెంకటేష్కు వినతిపత్రం అందజేశా రు. ఈ కార్యక్రమంలో లెంక రామకృష్ణ, యలకల భాస్కరరావు, నల్ల రవికుమార్, ఎందువ సీతంనాయుడు, పిల్లా తిరుపతిరావు, ఎందువ రామకృష్ణ, కుమరాపు చంద్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.