పేదల అన్నంపై అంత కక్షనా?
ABN , Publish Date - May 08 , 2024 | 11:05 PM
పేదల కడుపునింపే అన్న క్యాంటీన్లను వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్దాక్షిణ్యంగా మూసేసింది. ఒక పూట టిఫిన్, రెండు పూటల భోజనం చౌకగా అందించడంతో ఎంతోమంది పేదలు, కూలీలు, కార్మికులు, విద్యార్థులు రోజూ వాటిని ఆశ్రయించేవారు. రూ.5 చెల్లించి తృప్తిగా భోజనం చేసేవారు. ప్రభుత్వం మారాక చంద్రబాబుపై కక్షతో జగన్ వాటన్నింటినీ ఉన్నఫలంగా మూసేశారు. ఆ భవనాల్లో కొన్నింటిని ఇతర కార్యాలయాలకు ఉపయోగించారు. మిగతావాటిని అలాగే వదిలేశారు. అన్న క్యాంటీన్లు మూత పడ్డాక పేదల నుంచి చాలా వ్యతిరేకత వచ్చినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
పేదల అన్నంపై అంత కక్షనా?
నోటికాడ కూడు దూరం చేశావయ్యా జగనూ
చౌకగా ఆహారం అందించే అన్న క్యాంటీన్ల మూత
అప్పట్లోనే తీవ్రంగా వ్యతిరేకించిన కార్మికులు, కూలీలు
ఆహా క్యాంటీన్లు ప్రారంభించి అభాసుపాలు
పేదల కడుపునింపే అన్న క్యాంటీన్లను వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్దాక్షిణ్యంగా మూసేసింది. ఒక పూట టిఫిన్, రెండు పూటల భోజనం చౌకగా అందించడంతో ఎంతోమంది పేదలు, కూలీలు, కార్మికులు, విద్యార్థులు రోజూ వాటిని ఆశ్రయించేవారు. రూ.5 చెల్లించి తృప్తిగా భోజనం చేసేవారు. ప్రభుత్వం మారాక చంద్రబాబుపై కక్షతో జగన్ వాటన్నింటినీ ఉన్నఫలంగా మూసేశారు. ఆ భవనాల్లో కొన్నింటిని ఇతర కార్యాలయాలకు ఉపయోగించారు. మిగతావాటిని అలాగే వదిలేశారు. అన్న క్యాంటీన్లు మూత పడ్డాక పేదల నుంచి చాలా వ్యతిరేకత వచ్చినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
అన్న క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్న.. రాత్రి భోజనం. పూటకు రూ.5 చొప్పున మూడు పూటలూ కలిపి రూ.15కే ఆహారం లభించేది. రోజుకో రకమైన టిఫిన్ అందించడమే కాకుండా భోజనంలో వేడి అన్నం, కూర, సాంబారు, పచ్చడి, పెరుగు ఉండేవి. పరిశ్రభమైన వాతావరణంలో ప్రత్యేకంగా నిర్మించిన భవనంలో భోజనం పెట్టేవారు. తక్కువ ధరకు రుచికరమైన భోజనం అందిస్తున్న కారణంగా అనతికాలంలోనే మంచి స్పందన వచ్చింది. వందలాది మంది అన్నక్యాంటీన్లకు వచ్చేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్కసారిగా వాటన్నింటినీ మూత వేశారు. అనేక సంక్షేమ పథకాలు మాదిరిగా పేర్లు మార్చి కొనసాగించినా పేద ప్రజల ఆకలిమంటలు ఆగేవి. కాని మూసివేతకే ప్రాధాన్యం ఇచ్చి బడుగులకు తక్కువ ధరకే భోజనం లేకుండా చేశారు. వీటిని కొనసాగిస్తే ఆ పేరు టీడీపీకే వెళ్తుతుందని భావించారో ఏమోగాని మూత వేసేందుకే నిర్ణయించారు. ఇది తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
కేంద్రాలు ఇలా..
అన్న క్యాంటీన్లు విజయనగరంలో రెండు ఉండేవి. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని నీళ్ల ట్యాంక్ వద్ద ఒకటి, కార్పొరేషన్ కార్యాలయం వద్ద మరొకటి ఏర్పాటు చేశారు. వీటికి మంచి ఆదరణ లభించేది. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ల వద్ద యాచించే వారు కూడా క్యాంటీన్లను వినియోగించుకునేవారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక క్యాంటీన్ ఏర్పాటు చేశారు. నెల్లిమర్లలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ నిర్మాణ దశలో ఉంటుండగానే ఎన్నికలు వచ్చేశాయి. పూర్తి చేయకుండా వదిలేశారు. రాజాంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ఎత్తివేసి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంగా మార్చేశారు. గజపతినగరంలో ఓ ప్రైవేట్ భవనంలో అన్న క్యాంటీన్ను నిర్వహించారు. దీనిని కూడా మూసివేశారు. బొబ్బిలిలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ను వైసీపీ ప్రభుత్వం మూసివేయగా మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బేబీనాయన కొనసాగిస్తున్నారు. ఎస్.కోటలోని అన్న క్యాంటీన్ను మూసి వేశారు. చీపురుపల్లిలో ఓ ప్రభుత్వ పాత భవనంలో ఉండేది. అక్కడా మూతపడింది.
ఫ గ్రామీణ ప్రాంతాల నుంచి తెల్లవారగానే రైతులు కూరగాయలను మార్కెట్కు తెచ్చేవారు. వాటిని కొని చిరువ్యాపారులు వీధుల్లో తిరుగుతూ అమ్మేవారు. ఇరువురూ అన్నక్యాంటీన్లలో టిఫిన్ చేసేవారు. విద్యార్థులు, పోటీ పరీక్షలకు శిక్షణ పొందే నిరుద్యోగులు కూడా వాటిలోనే భోజనం చేసేవారు. ఇలా అన్ని వర్గాల పేదలకు అన్న క్యాంటీన్లు ఆకలి తీర్చేవి.
ఉదయాన్నే వచ్చేసేవాడ్ని
మా గ్రామం నుంచి విజయనగరానికి ఇంటర్ చదువుకు వచ్చేవాడ్ని. ఉదయాన్నే వేగంగా క్యారేజీ పెట్టేందుకు అమ్మ ఇబ్బంది పడేది. అన్న క్యాంటీన్ వచ్చిన తరువాత క్యారేజీ గురించి ఆలోచనే లేకపోయేది. టిఫిన్, భోజనం అందులోనే చేసేవాడిని. ఎత్తేయడం నా లాంటి పేద విద్యార్థులకు ఇబ్బందే.
రామకృష్ణ, విజయనగరం సమీప గ్రామం.
మెస్ బాధ ఉండేది కాదు
విజయనగరంలో పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్నాను. మెస్లో భోజనం చేసేందుకు డబ్బులు ఉండేవి కావు. అన్న క్యాంటీన్కు వెళ్లి రూ.5కే భోజనం చేసేవాడ్ని. ప్రభుత్వం క్యాంటీన్లు ఎత్తివేయటం చాలా అన్యాయం. పేదలపై తీవ్ర ప్రభావం పడింది.
- బి.వెంకటనాయడు, నిరుద్యోగి.