శిక్షణతో నైపుణ్యాభివృద్ధి సాధ్యం
ABN , Publish Date - Sep 19 , 2024 | 12:30 AM
శిక్షణ కార్యక్రమాలను నిర్వహిం చడం ద్వారా నిరుద్యోగ యువతలోని నైపుణ్యాన్ని వెలికితీసి తద్వారా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు.
డెంకాడ/భోగాపురం: శిక్షణ కార్యక్రమాలను నిర్వహిం చడం ద్వారా నిరుద్యోగ యువతలోని నైపుణ్యాన్ని వెలికితీసి తద్వారా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. భోగాపురం మండలం ముంజేరు సమీపంలో గల మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి సౌజన్యంతో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. నిరుద్యోగ యువత వేలాదిమంది తరలివచ్చి ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించేందుకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. సుమారు 2500 మందిని ఈ మేళాలో ఉద్యోగాలకు ఎంపిక చేసినట్టు చెప్పారు. తగినంత నైపుణ్యం లేకపోవడం వల్లనే ఈ ప్రాంతంలో యువత కొంత వెనుకబాటుకు గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారి సామర్ధ్యానికి పదును పెట్టేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మాట్లాడుతూ ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మెగా జాబ్మేళాతో ఆ దిశగా తొలి అడుగు వేశామని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి కనీసం రూ.25వేల ఆదాయం ఉండాలని అన్నారు. భోగాపురం విమానాశ్రయం శరవేగంగా నిర్మాణం జరుగుతోందని... పూర్తయున వెంటనే ఈ ప్రాంతం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిరాకిల్ సాఫ్ట్వేర్ సీఈఓ లోకం ప్రసాద్, డీఆర్డీఏ పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, జిల్లా నైపుణ్యాధికారి గోవిందరావు, జిల్లా ఉపాధి అధికారి డి.అరుణ , తహసీల్దారు సారి గోవింద, ఎం.సురేష్, మిరాకిల్ డైరెక్టర్ శ్రీనివాస్ బెహరా, బి .శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.