Share News

598 మంది టీచర్లకు షోకాజ్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:14 PM

జిల్లాలోని 598 మంది ఉపాధ్యాయులకు శనివారం విద్యాశాఖ అధికారులు షోకాజ్‌ నోటీసులు అందించారు. కనీస సౌకర్యాలు లేని పాఠశాలలకు సంబంధించిన వాస్తవాలను ఏకీకృత జిల్లా సమాచార దరఖాస్తులో నమోదు చేయలేదనే కారణంతో నోటీసులు ఇచ్చారు.

598 మంది టీచర్లకు షోకాజ్‌
నోటీసులు వెనక్కి తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తున్న దృశ్యం

మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు

లేని సౌకర్యాలు ఉన్నట్టు ఎలా చూపించాలంటూ ప్రశ్నిస్తున్న నాయకులు

వైసీపీ సర్కారు, విద్యాశాఖ ఉన్నతాధికారుల తీరుపై పెదవి విరుపు

పార్వతీపురం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 598 మంది ఉపాధ్యాయులకు శనివారం విద్యాశాఖ అధికారులు షోకాజ్‌ నోటీసులు అందించారు. కనీస సౌకర్యాలు లేని పాఠశాలలకు సంబంధించిన వాస్తవాలను ఏకీకృత జిల్లా సమాచార దరఖాస్తులో నమోదు చేయలేదనే కారణంతో నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. అయితే దీనిపై యూటీఎఫ్‌ నాయకులు ఎస్‌.మురళీమోహన్‌రావు, తోట రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నోటీసులను వెనక్కి తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారికి శనివారం సాయం త్రం వారు వినతిపత్రం అందించారు. పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల లేకపోతే.. ఉన్నట్టు ఎలా ఉపాధ్యాయులు ధ్రవీకరిస్తారని ప్రశ్నించారు. పాఠశాలల్లో వాస్తవ పరిస్థితు లపై సమాచారం అందిస్తే .. ఉపాధ్యాయులు తప్పు చేసినట్టుగా షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఇంటర్నెట్‌, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు లేవని, దీనిపై వాస్తవ సమాచారాన్ని అందిస్తే.. విద్యాశాఖ ఉన్నతాధికారులు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. ఉపాధ్యాయు లపై చర్యలు తీసుకొనేందుకు విద్యాశాఖ ఉపక్రమిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. షోకాజ్‌ నోటీసులకు వెంటనే సమాధానం ఇవ్వాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవడం చూస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం ఇంకా తమను వేధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా ఉందని విమర్శించారు. తక్షణమే నోటీసులను వెనక్కి తీసుకోవాలని, లేదంటే పెద్దఎత్తు ఆందోళన చేస్తామని యూటీఎఫ్‌ నాయకులు హెచ్చరించారు.

Updated Date - Apr 27 , 2024 | 11:14 PM