శంఖారావానికి నీరాజనం
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:00 AM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన శంఖారావం యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. తొలిరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో సభలు విజయవంతమయ్యాయి.
![శంఖారావానికి నీరాజనం](https://media.andhrajyothy.com/media/2023/20231205/hedding2_9032ae23d6.gif)
శంఖారావానికి
నీరాజనం
శ్రీకాకుళం, ఫిబ్రవరి 12: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన శంఖారావం యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. తొలిరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో సభలు విజయవంతమయ్యాయి. రెండో రోజు సోమవారం నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో శంఖారావం యాత్ర నిర్వహించగా.. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వైసీపీ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, రానున్నది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనంటూ లోకేశ్ భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాను ప్రత్యేక బాధ్యత వహిస్తానంటూ స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న అభివృద్ధి పనులు, అమలు చేయనున్న పథకాల గురించి వివరిస్తూ ప్రజల భవిష్యత్కు గ్యారెంటీ ఇచ్చారు. శ్రీకాకుళంలో మాట్లాడుతూ ఈ నియోజక వర్గానికి ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేగా, మంత్రిగానూ ఉన్నారని, ఆయన కుమారుడు ఇసుక దోపిడీ తప్ప.. నియోజకవర్గానికి చేసిందేమిటంటూ ప్రశ్నించారు.
లోకేశ్ సభకు చురుగ్గా ఏర్పాట్లు
రాజాం, ఫిబ్రవరి 12: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం సదస్సులకు జిల్లాలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అన్నిచోట్లా స్థలాల ఎంపిక పూర్తయింది. హాజరయ్యే ప్రజలకు ఇబ్బంది లేకుండా.. వాహన రాకపోకలకు అవాంతరాలు కలగకుండా చూస్తున్నారు. ఈనెల 15వ తేదీన రాజాంలోని పాలకొండ రోడ్డులో సీతారామ థియేటర్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో బహిరంగ సభ ఉంటుందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కోండ్రు మురళీమోహన్ చెప్పారు. ఏర్పాట్లను తన అనుచరులతో సోమవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ లోకేశ్ పూరించిన శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక యువత పెడదారి పడుతోందని, రాష్ట్ర యువతకు మంచి భవిత నారా లోకేశ్ నాయకత్వంతోనే సాధ్యమన్నారు. ఏర్పాట్ల పరిశీలనలో కిమిడి అశోక్కుమార్, గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనువాసరావు తదితరులు ఉన్నారు.
విజయవంతం చేయాలి: బేబీనాయన
బాడంగి : ఈ నెల 14న బాడంగిలో జరగనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బొబ్బిలి టీడీపీ ఇన్చార్జి బేబీనాయన కోరారు. స్థానిక తెంటు బంగ్లాలో బాడంగి, తెర్లాం నాయకులు, కార్యకర్తలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా బేబీనాయన మాట్లాడుతూ లోకేష్ సభకు అధికసంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు మాట్లాడుతూ బాడంగి మండలం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటని మరోసారి తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
---------------------