Share News

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

ABN , Publish Date - Mar 30 , 2024 | 11:52 PM

ఏసీబీ వలకు ఓ పంచాయతీ కార్యదర్శి చిక్కారు. సాల్వెన్సీ సర్టిఫికెట్‌ కోసం లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు.

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి మురళీ

రూ.2,600 తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వైనం

మక్కువ: ఏసీబీ వలకు ఓ పంచాయతీ కార్యదర్శి చిక్కారు. సాల్వెన్సీ సర్టిఫికెట్‌ కోసం లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలో కన్నంపేట గ్రామానికి చెందిన చీకటి గణపతి తండ్రి ఆదినారాయణ సారా కేసులో ఇటీవల అరెస్ట్‌ అయ్యారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉండగా బెయిల్‌ కోసం ఇద్దరు వ్యక్తుల ఆస్తుల పూచీకత్తుతో సాల్వెన్సీ సర్టిఫికెట్‌ అవసరం. దీంతో గణపతి కాశీపట్నం పంచాయతీ కొండరేజారు గ్రామంలో బంధువులను ఆశ్రయించాడు. కాగా బంధువులు ఆస్తులు కాశీపట్నం పరిధిలోనే ఉండడంతో గణపతి సాల్వెన్సీ సర్టిఫికెట్‌ కోసం ఆ పంచాయతీ కార్యదర్శి పెంట మురళీని బుధవారం సంప్రదించారు. అయితే రూ. మూడు వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. తన వద్ద అంత నగదు లేదని, ఇవ్వలేమని గణపతి వేడుకున్నా.. కార్యదర్శి అంగీకరించలేదు. చివరకు రూ.2,600 ఇచ్చేందుకు గణపతి అంగీకరించాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి అసలు విషయాన్ని చెప్పాడు. ఈ మేరకు ఏసీబీ అధికారుల సూచనలతో గణపతి శనివారం కాశీపట్నం సచివాలయంలో రూ.2,600 కార్యదర్శి మురళీకి అందించగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా ఆయన్ని పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని కార్యదర్శపై కేసు నమోదు చేశారు. ఏసీబీ డీఎస్పీ టి.రామచంద్రరావు, ఇన్‌స్పెక్టర్లు మహేశ్వరరావు, శ్రీనివాసరావు, రమణ పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2024 | 11:52 PM