పాటల్లోనే కాదు.. ముగ్గుల్లోనూ భళా
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:33 AM
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజయనగరం నుంచి పాల్గొన్న మొలుగు రాజు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

పాటల్లోనే కాదు.. ముగ్గుల్లోనూ భళా
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముగ్గుల పోటీల్లో రాజుకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజయనగరం నుంచి పాల్గొన్న మొలుగు రాజు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విజయవాడలో రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలు కెనరా బ్యాంక్ సహకారంతో గురువారం జరిగాయి. విజయనగరం జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో రాజు ఇప్పటికే ప్రథమ బహుమతి పొంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అక్కడ కూడా ప్రతిభ కనబరిచి రూ.30వేలు నగదు బహుమతిని కైవసం చేసుకున్నారు.
చిన్నప్పటి నుంచి రాజు కల్చరల్ యాక్టివిటీల్లో చురుగ్గా ఉంటూ వస్తున్నారు. తల్లి కడుపులో ఉండగనే తండ్రిని కోల్పోయారు. పుట్టిన తరువాత తండ్రి పేరునే తన పేరుగా చేసుకున్నారు. తండ్రి మొలుగు రాజు టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. ప్రస్తుతం తల్లి లక్ష్మి అంగన్వాడీ ఆయాగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. రాజుకు అన్నయ్య, అక్క ఉన్నారు. వీరికి వివాహాలు అయ్యాయి. కుటుంబ పోషణలో తల్లికి రాజు చేదోడుగా ఉంటోంది. పాటలు పాడటంలో కూడా తర్ఫీదు పొందింది. స్థానిక సంగీత కళాశాలలో ఓకల్ అంశంలో సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసిన ఈమె ఆర్కిస్ట్రాలో చేరి పాటలు పాడుతున్నారు.